సిక్కింలో హిమపాతం..6 మంది మృతి

సిక్కింలో హిమపాతం..6 మంది మృతి

సిక్కింలో మంచుకొండ విరిగిపడిన ఘటనలో ఆరుగురు పర్యాటకులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. సిక్కింలోని నాథులా సరిహద్దు ప్రాంతంలో  జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో సంభవించిందని ఒక అధికారి తెలిపారు.  మంచుకొండ విరిగిపడిన సమయంలో 150 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. పర్యాటకుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 22 మందిని రెస్క్యూ చేసినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

ఏప్రిల్ 04వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు తూర్పు సిక్కింలోని 14వ మైలు రాయికి సమీపంలో.. గ్యాంగ్టక్-నాథులాను కలిపే జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో  భారీ హిమపాతం సంభవించింది. సంఘటన స్థలానికి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బృందాలు, సిక్కిం పోలీసులు.. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్, టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులు చేరుకున్నారు.  గాయపడినవారిని సిక్కిం రాజధాని నగరం గ్యాంగ్టక్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో మొత్తం 80 పర్యాటకుల వాహనాలు  ఉన్నాయి. పర్వత ప్రాంతంలో సూచించిన దూరాన్ని దాటి వెళ్లకూడదని టూరిస్టులు నిబంధనలు పాటించాలని సూచించినా..వారు ఉల్లంఘించి ముందుకు వెళ్లారని అధికారులు చెప్పారు.

మార్చి4వ తేదీన టూరిస్టులు త్సోమ్ గో సరస్సుకు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే అక్కడ భారీగా మంచుకురుస్తోందని టూర్ ఆపరేటర్ తెలపడంతో 17వ మైలు సమీపంలో ఆగిపోయారు. ఈ సమయంలో పర్యాటకులు ఫోటోలు తీయడానికి, మంచును ఆస్వాదించడానికి బయట నడుచుకుంటూ వెళ్లారు. దీంతో ఒక్కసారిగా మంచుచరియ విరిగిపడింది.  రోడ్డుపై గుట్టలు గుట్టలుగా మంచు పడింది. వీటికొంద టూరిస్టులు చిక్కుకుపోయారు.  కొందరైతే రోడ్డు కిందకు కొట్టుకుపోయారు.