- ప్రెగ్నెన్సీ నిరోధించే జనరిక్కు యూఎస్ ఎఫ్డీఏ అడ్డంకులు
- కంప్లీట్ రెస్పాన్స్ లెటర్ జారీ
హైదరాబాద్, వెలుగు : మహిళలకు ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే జనరిక్ వెర్షన్ను అమెరికాలో విడుదల చేయనున్న డాక్టర్ రెడ్డీస్కు ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై కంప్లీట్ రెస్పాన్స్ లెటర్ను యూఎస్ ఎఫ్డీఏ జారీ చేసింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ షేర్లు ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయి. ప్రెగ్నెన్సీని నిరోధించే నువారింగ్ జనరిక్ వెర్షన్పై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తాము కంప్లీట్ రెస్పాన్స్ లెటర్ను పొందామని హైదరాబాద్కు చెందిన ఈ ల్యాబోరేటరీ చెప్పింది. డ్రగ్ రెగ్యులేటరీ లేఖపై స్పందించేందుకు తాము సిద్ధమవుతున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే ఎంత సమయంలోపు స్పందించనున్నారో మాత్రం రెడ్డీస్ ల్యాబ్స్ క్లారిటీ ఇవ్వలేదు. కంప్లీట్ రెస్పాన్స్ లెటర్ను సాధారణంగా ఏదైనా అప్లికేషన్కు అనుమతి ఇవ్వకూడదనే సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినప్పుడే యూఎస్ ఎఫ్డీఏ జారీ చేస్తోంది. అయితే తొలి క్వార్టర్ ఫలితాల ప్రకటన అనంతరం.. ఎఫ్డీఏ నుంచి అదనంగా పలు ప్రశ్నలకు తాము సమాధానం చెప్పాల్సి ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ఎరేజ్ ఇజ్రాయెల్ తెలిపిన సంగతి తెలిసిందే.
నువారింగ్ మార్కెట్ సైజు రూ.5,632 కోట్లు
మెర్క్ అండ్ కో అభివృద్ధి చేసిన నువారింగ్కు ఇప్పటి వరకు అమెరికాలో ఆమోదం పొందిన జనరిక్ వేరియంట్లు లేవు. దీని మార్కెట్ సైజు ఆ దేశంలో 790 మిలియన్ డాలర్ల(రూ.5,632 కోట్లు) వరకు ఉంటుంది. రెడ్డీస్తో పాటు, టెవా ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆమ్నీల్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ వంటివి కూడా యూఎస్ ఎఫ్డీఏ వద్ద దీన్ని జనరిక్ చేయడం కోసం దరఖాస్తు దాఖలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నువారింగ్ను ముందుగా అనుకున్నట్లుగా డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి తేలేదని, 2020 మధ్య నాటికి కంటే ముందుగా లాంచ్ చేసే అవకాశం లేదని సిటీ రీసెర్చ్ ప్రశాంత్ నాయర్ చెప్పారు. ఈ వార్తలతో,డాక్టర్ రెడ్డీస్ స్టాక్ ధర టార్గెట్ను రూ.2,540 నుంచి రూ.2,375కు మార్చుతున్నట్టు సిటీ రీసెర్చ్ తెలిపారు. ఒక్కో షేరుపై పొందే రెవెన్యూ 2021 ఆర్థిక సంవత్సరానికి 6 శాతానికి కుదించారు. ఈ జనరిక్ వెర్షన్ లాంచ్కు ఎనిమిది నుంచి 12 నెలల జాప్యం జరుగుతుందని ఇన్వెస్టెక్ ఫార్మా అనలిస్ట్ అన్షుమాన్ గుప్తా తెలిపారు. ఈపీఎస్ కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఈ డ్రగ్ అప్రూవల్పై కొంత ఆందోళన వ్యక్తం చేశారు. నాయర్, గుప్తా ఇద్దరు కూడా అమెరికా ఏజెన్సీ లేఖతో.. నువారింగ్ లాంచ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలే ఉన్నాయని అంచనావేస్తున్నారు. ఫిబ్రవరి 15 నాటి స్థాయిలకు డాక్టర్ రెడ్డీస్ షేర్లు పడిపోయి, 8 శాతం నష్టంతో రూ.2,351.20 వద్ద ట్రేడయ్యాయి.
విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ స్కాలర్షిప్లు
ప్రతిభావంతులైన విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ స్కాలర్షిప్లను అందజేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను, నల్గొండ రీజియన్లోని జిల్లా పరిషత్ హై స్కూళ్లలో 58 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లను అందించింది. ఎస్ఎస్సీలో మెరుగైన గ్రేడ్లు సాధించిన వారికి ఈ స్కాలర్షిప్లు వచ్చాయి. చాలా మంది విద్యార్థులు డబ్బులు లేకపోవడంతో, ఉన్నత విద్యను అభ్యసించకుండా.. మధ్యలోనే ఆపివేస్తున్నారని, ఈ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్రొగ్రామ్ కింద, ప్రతేడాది బాగా చదివే విద్యార్థులను గుర్తించి, పోస్ట్ ఎస్ఎస్సీ స్కాలర్షిప్లను వారికి అందిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ చెప్పింది. మంచి విద్యను పొందడం ప్రతి విద్యార్థి హక్కని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది.
