హైదరాబాద్, వెలుగు: ప్రముఖ డిజిటల్ వర్క్ఫ్లో కంపెనీగా పేరున్న సర్వీస్నౌ తన ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను నగరంలోని నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసింది. అమెరికా వెలుపల ప్రపంచంలో రెండో అతిపెద్ద సెంటర్ ఇదేనని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ సెంటర్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్గా ఇది ఉండబోతుంది. ఒకప్పుడు సర్వీస్నౌ ఇద్దరుగా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించి, ఐదేళ్ల తర్వాత ఇప్పుడు 2 వేల మందికి చేరుకోవడం ఆనందంగా ఉందని జయేశ్ రంజన్ అన్నారు. తెలంగాణకు సర్వీస్నౌ విశ్వసనీయమైన పార్టనర్ అని పేర్కొన్నారు. హైదరాబాద్ చాలా గ్లోబల్ కంపెనీలకు టెక్నాలజీ హబ్గా మారిందన్నారు. వచ్చే ఐదేళ్లలో సర్వీస్నౌ మరింత ఎదగాలని ఆశిస్తున్నట్టు కోరుకున్నారు.
హైదరాబాద్, ఇండియా నుంచి తమ రెవెన్యూలు వార్షికంగా 35 శాతం వృద్ధిని సాధిస్తున్నాయని సర్వీస్నౌ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్, ప్రొడక్ట్ ఆపరేషన్స్ ఇండియా హెడ్ రావు సూరపనేని చెప్పారు. హైదరాబాద్ ఆర్గనైజేషన్ తమకు సరికొత్త ఆవిష్కరణలు చేపట్టడానికి సాయపడుతుందన్నారు. గ్లోబల్గా సర్వీస్నౌలో 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిలో రెండు వేల మంది ఇక్కడే వర్క్ చేస్తున్నట్టు సర్వీస్నౌ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ సిజె దేశాయ్ చెప్పారు. ప్రస్తుతం మూడు అంతస్తులలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్, 80 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. మరో 9 లేదా 12 నెలల్లో మరో రెండు అంతస్తులకు ఈ సెంటర్ను విస్తరించనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా 500 మంది ఉద్యోగులను కూడా తీసుకోనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే గ్లోబల్గా 10 డెవలప్మెంట్ సెంటర్లుంటే, దానిలో రెండు బెంగళూరు, హైదరాబాద్లో ఉన్నాయి.
