ప్ర‌పంచం మొత్తానికి క‌రోనా వ్యాక్సిన్లు అందాలంటే 4ఏళ్ల స‌మ‌యం ప‌ట్టొచ్చు : సీరం సీఈఓ

ప్ర‌పంచం మొత్తానికి క‌రోనా వ్యాక్సిన్లు అందాలంటే 4ఏళ్ల స‌మ‌యం ప‌ట్టొచ్చు : సీరం సీఈఓ

ప్ర‌పంచం మొత్తానికి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ను అందించేందుకు నాలుగైదు సంవత్సరాల పడుతుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా తెలిపారు. ఫైనాన్షియ‌ల్ టైమ్స్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సీరం ఇండియా సీఈఓ మాట్లాడుతూ..ఫార్మా సంస్థ‌లు ప్ర‌పంచం మొత్తానికి స‌రిపడే క‌రోనా వ్యాక్సిన్ ను త‌యారు చేయ‌డం లేద‌న్నారు.

ప్ర‌పంచం మొత్తానికి క‌రోనా వ్యాక్సిన్ అందించేందుకు నాలుగైదు సంవత్సరాలు పడుతుందని చెప్పారు. మ‌న‌దేశంలో 1.4 బిలియ‌న్ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ ను అందించడంలో స‌హాయ‌ప‌డే అధునాత‌న కోల్డ్ చైన్ మౌలిక స‌దుపాయాలు లేవ‌న్నారు.

మ‌న‌దేశంలో 400మిలియ‌న్ల టీకాల కంటే ఎక్కువ మోతాదులో ఉత్ప‌త్తి చేసేలా ప్ర‌ణాళిక‌లు లేవ‌ని.. ఒక‌వేళ ఉత్ప‌త్తి చేసే సామ‌ర్ధ్యం ఉన్నా..వాటిని అందరికి చేర‌వేసేలా సౌక‌ర్యాలు లేవ‌ని పేర్కొన్నారు.

క‌రోనా వైర‌స్ రెండు మోతాదుల టీకా అయితే మీజిల్స్ లేదా రోట‌వైర‌స్ టీకాల మాదిరిగానే క‌రోనా వైర‌స్ టీకాలు ప్రంపంచం మొత్తానికి 15బిలియ‌న్ల మోతాదులో అవ‌స‌ర‌మ‌ని చెప్పారు.

కాగా పూణేకు చెందిన సీరమ్ ఇండియా సంస్థ ప్రస్తుతం 170 దేశాలకు 1.5 బిలియన్ మోతాదుల పోలియో, మీజిల్స్ మరియు ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. కరోనావైరస్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి ఆస్ట్రాజెనెకాతో సహా ఐదు గ్లోబల్ ఫార్మా కంపెనీలతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

ఆక్స్ ఫ‌ర్డ్ – ఆస్ట్రాజెనెకా యొక్క క‌రోనా వ్యాక్సిన్ 1 బిలియన్ వ్యాక్సిన్ల‌ను ఉత్పత్తి చేయాలని సీర‌మ్ ఇండియా ప్లాన్ చేస్తోంది. అందులో సగం వ్యాక్సిన్లు ఇండియాకు అందిస్తామ‌ని హామీ ఇచ్చింది.

భారతదేశంలో కోవిషీల్డ్ గా పిలువబడే ఆక్స్ ఫ‌ర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా AZD1222 వ్యాక్సిన్ మూడో ద‌శ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ యూకేలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.