
హిందువుల పండుగల్లో ముఖ్యమైన వాటిల్లో వినాయకచవితి ఒకటి. ఈ పండుగను వాడ వాడలా ఘనంగా వైభవంగా నిర్వహిస్తాము. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ ఉత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యాయి. వినాయకుడు లోక కళ్యాణం కోసం... దుష్ట శిక్షణ... రాక్షసులను హతమార్చేందుకు అనేక అవతారాలను ధరిస్తాడు. ఈ తొమ్మిది రోజులు ( వినాయక నవరాత్రిళ్లు) ఒక్కో ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని ఆవాహన చేసి పూజించాలి. రేపు (సెప్టెంబర్ 21) గురువారం నాలుగవరోజు. గణేష్ చతుర్ధి వేడుకల్లో నాలుగవరోజు ఏ అవతారాన్ని ఆవాహన చేయాలి.. దాని విశిష్ఠత ఏమిటి.. అందులోని అర్దం పరమార్ధం ఏంటో తెలుసుకుందాం.. .
4వ రోజు భాద్రపద శుద్ధ సప్తమి ( సెప్టెంబర్ 21)
నవరాత్రుల నాలుగోరోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి. లోభాంతకుడయిన గజాననుడికి చెరకుగడ నివేదన చేయాలి. విశ్వ బ్రహ్మ కుమారుడైన కుబేరుడు తన మారు సోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడు. తండ్రి సూచన మేరకు కైలాసానికి వెళ్తాడు కుబేరుడు. అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. మనసు చెదిరి, చూపుల్లో చాంచల్యం ఏర్పడుతుంది. కుబేరుడి మనోవికారాన్ని గుర్తించిన పార్వతి కోపంగా చూడటంతో అతని ఒక కన్ను మాడిపోతుంది. ఆ కంటి బూడిద నుంచి పుట్టినవాడే లోభాసురుడు.
రాక్షస ప్రవృత్తి కలిగిన లోభాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజేయ వరాలు పొందుతాడు. లాలస అనే కన్యను వివాహమాడతాడు. దుష్టబుద్ధితో మునులను, రుషులను పీడిస్తూ ఉంటాడు. అప్పుడు వారు రైభ్యుడనే మునిని ఆశ్రమంలో సమావేశం అయి.. గజానన వినాయకుడిని ప్రార్థించారు. వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు. శివ, శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు. దాంతో లోభాసురుడు గజాననుడి శరణు వేడాడు. గజానన వినాయకుడు లోభుడిని పాతాళానికి పొమ్మని ఆదేశిస్తాడు. ధర్మవిరుద్ధం కాని లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు. ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే...