ముంబై: వరుసగా ఆరు సెషన్లలో లాభపడిన ఇండియన్ మార్కెట్లకు సోమవారం బ్రేక్ పడింది. ఇండియా–చైనా మధ్య బార్డర్ టెన్షన్లు చెలరేగడంతో సెన్సెక్స్ ఏకంగా 839 పాయింట్లు పతనం అయ్యింది. ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకోవడం, వరుసగా ఐదో నెలలోనూ ఎనిమిది కీలక రంగాల ప్రొడక్షన్ పడిపోవడం కూడా మార్కెట్ల పతనాన్ని శాసించాయి. ఉదయం సెషన్లో 543 పాయింట్లు ర్యాలీ చేసి 40,000 పాయింట్ల మార్క్ను అందుకున్న సెన్సెక్స్ ఆ స్థాయి నుంచి సుమారుగా 1300 పాయింట్లు పడింది. చివరికి 839.02 పాయింట్ల నష్టంతో 38,628.29 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 260.10 పాయింట్లు పడి 11,387.50 వద్ద ముగిసింది. తూర్పు లడఖ్లో చైనీస్ ఆర్మీ కదలికలతో ఇండియా–చైనా మధ్య తాజాగా బార్డర్ టెన్షన్లు చెలరేగాయి. ఓఎన్జీసీ, టీసీఎస్ మాత్రమే లాభాల్లో ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి 21 పైసలు బలహీనపడి 73.60 వద్ద ముగిసింది.
