దేశంలో ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ ఇండస్ట్రీ విస్తరిస్తుండడంతో ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయడానికి ఓ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అవసరమని నీతి ఆయోగ్ పేర్కొంది. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్లో పాల్గొనేందుకు కేవలం 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి మాత్రమే అనుమతించాలని తెలిపింది. ‘గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది యూనిఫామ్ నేషనల్ లెవెల్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ ’ పేరుతో ఓ డ్రాఫ్ట్ను నీతి ఆయోగ్ సిద్ధం చేసింది. ఫాంటసీ స్పోర్ట్స్పై ప్రజలకు ఆసక్తి పెరుగుతుండడంతో, ఈ సెగ్మెంట్ని ఓ ఇండస్ట్రీగా ప్రభుత్వం గుర్తించాలనుకుంటోందని పేర్కొంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓ సెల్ఫ్రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫాంటసీ స్పోర్ట్స్ ఇండస్ట్రీని కంట్రోల్లో ఉంచుతుందని తెలిపింది. ఈ రెగ్యులేటరీ సంస్థకు ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్స్(ఓఎఫ్ఎస్పీ) ఆపరేటర్స్లో మెంబర్షిప్ ఉండాలని పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో ఫాంటసీ స్పోర్ట్స్పై నియంత్రణలు వేరు వేరుగా ఉంటున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాల యూజర్లు ఫాంటసీ స్పోర్ట్స్ ఎక్స్పీరియెన్స్ను పొందలేకపోతున్నారు. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ గేమ్స్ కంటే భిన్నంగా ఉంటాయి. రియల్గా జరుగుతున్న గేమ్పై ఆధారపడి ఈ ప్లాట్ఫామ్స్ పనిచేస్తాయి. అందువలన వీటిని నాన్ ఎడిక్టివ్ స్పోర్ట్స్ అని అంటున్నారు. గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్కు ఇవి భిన్నంగా ఉంటున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఓ బోర్డు కంట్రోల్లో రెగ్యులేటరీ ఆర్గనైజేషన్..
18 ఏళ్లు కంటే తక్కువ వయసున్న యూజర్లకు ఫాంటసీ స్పోర్ట్స్ కంటెస్ట్లను ఓఎఫ్ఎస్పీలు ఆఫర్ చేయకూడదని నీతి ఆయోగ్ పేర్కొంది. మైనర్లను ప్రొటెక్ట్ చేసేందుకు అన్ని రకాల చర్యలను ఈ ప్లాట్ఫామ్స్ తీసుకోవాలని తెలిపింది. ఓ ఇండిపెండెంట్ బోర్డు ద్వారా నడిచే సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫాంటసీ స్పోర్ట్స్ ఇండస్ట్రీని నియంత్రణలో ఉంచుతుందని నీతి ఆయోగ్ డ్రాఫ్ట్లో పేర్కొంది. ఈ బోర్డులో గవర్నెన్స్, లా, అడ్మినిస్ట్రేషన్లలో అనుభవం ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. వీరిని ఈ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ నిర్ధిష్టమైన పదవీ కాలానికి ఎన్నుకోవాలని ఆయోగ్ తెలిపింది. ఓఎప్ఎస్పీలకు వ్యతిరేకంగా లేదా వీటికి సంబంధించి యూజర్లు చేసే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఓ మెకానిజాన్ని సెల్ఫ్ రెగ్యులేటరీ ఏర్పాటు చేయాలని ఈ డ్రాఫ్ట్ చెబుతోంది. ఫాంటసీ స్పోర్ట్స్ వివిధ రాష్ట్రాలలో ఎదుర్కొంటున్న సమస్యలను నేషనల్ లెవెల్లో రూల్స్ను తెచ్చి పరిష్కరించే అవకాశం ఉంది. ‘ నేషనల్ పాలసీని తీసుకురావడం వలన ఫాంటసీ స్పోర్ట్స్పై రెగ్యులేటర్స్, ఆపరేటర్స్, యూజర్లకు ఒక క్లారిటీ వస్తుంది’ అని ఆయోగ్ డ్రాఫ్ట్లో పేర్కొంది. ఫాంటసీ స్పోర్ట్స్ ఇండస్ట్రీ రెగ్యులేటరీ రూల్స్లో ప్రభుత్వ ప్రమోయం ఉండనుంది. డ్రాఫ్ట్ ప్రకారం ఫాంటసీ గేమ్స్ ఇండస్ట్రీకి మార్కెట్ను క్రియేట్ చేయడం, గ్రోత్కు అవకాశం కల్పించడం వంటివి ప్రభుత్వం చేసే అవకాశం ఉందని తెలిసింది. పారదర్శకత, కన్జూమర్ల ఇంట్రెస్ట్ను కాపాడడం, జవాబుదారితనం వంటివి ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫాలో అవుతుందని ఆయోగ్ పేర్కొంది. రెగ్యులేటరీ సంస్థను చూసే బోర్డు యూనిఫామ్ గైడ్లైన్స్కు బాధ్యత వహించాలని, ఓఎఫ్ఎస్పీలు రూల్స్కు తగ్గట్టు పని చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్లో మెంబర్లుగా ఉన్న అన్ని ఓఎఫ్ఎస్పీలు కొన్ని రూల్స్ మినహాయింపులలో ప్రయోజనాన్ని పొందుతాయని తెలిపింది. ఈ సెక్టార్లో వచ్చే మార్పులకు తగ్గట్టు ఈ గైడ్లైన్స్ మారతాయని పేర్కొంది.
ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రూ. 10 వేల కోట్లకు పైనే
ఇండియాలో ఫాంటసీ స్పోర్ట్స్లలో పాల్గొంటున్న యూజర్లు ఏడాదికి 212 శాతం సీఏజీఆర్తో పెరుగుతున్నారని కేపీఎంజీ ఓ మార్కెట్ రిపోర్ట్లో తెలిపింది. జూన్, 2016 లో 20 లక్షల మందిగా ఉన్న యూజర్లు, డిసెంబర్, 2019 నాటికి 9 కోట్ల మందికి పెరిగారని తెలిపింది. రానున్న కొన్నేళ్లలో రూ. పదివేల కోట్లకు పైనే విదేశీ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించే కెపాసిటీ ఈ ఇండస్ట్రీకి ఉందని పేర్కొంది. అంతేకాకుండా 2023 నాటికి 150 కోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను క్రియేట్ చేయగలదని అంచనావేసింది. వచ్చే 2–3 ఏళ్లలో ఫాంటసీ స్పోర్ట్స్ ఇండస్ట్రీ ప్రత్యేక్షంగా 5 వేలకు పైన ఉద్యోగాలను, పరోక్షంగా 7 వేలకు పైగా ఉద్యోగాలను క్రియేట్ చేయగలదని ప్రైస్వాటర్హౌస్కూపర్స్ ఇండియా ఓ రిపోర్ట్లో పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో ఈ ఇండస్ట్రీ నుంచి రూ. 3 వేల కోట్లు నుంచి 3,500 కోట్ల వరకు జీఎస్టీ రెవెన్యూ ప్రభుత్వానికి అందుతుందని తెలిపింది. వీటికి అదనంగా ఓఎఫ్ఎస్పీలు కట్టే కార్పొరేట్ ట్యాక్స్, గెలిచిన వారిపై ఇన్కమ్ ట్యాక్స్ను విధించడం వలన సుమారు రూ. 7 వేల కోట్లు నుంచి రూ. 10 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి అందుతుందని అంచనావేసింది.
