ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో పాలనా వైఫల్యాలకు (గవర్నెన్స్ ల్యాప్సెస్) బాధ్యత వహిస్తూ రూ.3.12 కోట్లు చెల్లించాలని ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ మరోసారి నోటీసు పంపింది. ఈ డబ్బును15 రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. సెబీ ఇది వరకే ఆమెకు విధించిన జరిమానాను చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో తాజా నోటీసు వచ్చింది. ఎన్ఎస్ఇ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆనంద్ సుబ్రమణియన్ను గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ అడ్వైజర్గా నియమించడం అక్రమమని సెబీ ఇది వరకే స్పష్టం చేసింది. ఇది పాలనాపరమైన లోపమని పేర్కొంటూ రూ.3 కోట్ల పెనాల్టీని విధించింది. కంపెనీ రహస్య సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తితో పంచుకున్నారని ఆరోపించింది. చిత్రతోపాటు ఆమెకు ముందు ఎన్ఎస్ఈ చీఫ్గా పనిచేసే రవి నారాయణ్, సుబ్రమణియన్తోపాటు ఇతరులకూ పెనాల్టీని విధించింది. వడ్డీ, రికవరీ ఖర్చుతో సహా రూ.3.12 కోట్లను 15 రోజుల్లోగా చెల్లించకుంటే ఆమె ఆస్తులను అమ్ముతామని, అరెస్టు కూడా తప్పదని హెచ్చరించింది. ఎన్ఎస్ఈ కో–లొకేషన్ కేసులో అరెస్టయిన చిత్ర ఈ ఏడాది మార్చి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్నారు.
