అదాని కంపెనీలపై సెబీ, డీఆర్​ఐ నజర్​

అదాని కంపెనీలపై సెబీ, డీఆర్​ఐ నజర్​

న్యూఢిల్లీ  అదాని గ్రూప్​ కంపెనీలపై సెబీ, డీఆర్​ఐ దర్యాప్తు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్​గా వెల్లడించింది. రూల్స్​ పాటించనందుకుగాను ఈ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి లోక్​సభలో ఈ వివరాలు వెల్లడించారు. అదాని గ్రూప్​ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన మారిషస్​ కంపెనీల ఖాతాలను 2016లో ఫ్రీజ్​ చేసిన మాట నిజమేనని, కొన్ని లిస్టెడ్​ కంపెనీల జీడీఆర్​ ఇష్యూల విషయంలో ఈ ఫ్రీజ్​ జరిగిందని మంత్రి చెప్పారు. ఇతర కంపెనీల విషయంలో ఈ ఫ్రీజ్​ లేదని పేర్కొన్నారు. రెగ్యులేషన్స్​ పాటించారా లేదా అనే విషయంలో అదాని గ్రూప్​ కంపెనీలపై సెబీ దర్యాప్తు జరుపుతోందని చెప్పారు. ఇంతకు మించిన వివరాలను ఆయన ఇవ్వలేదు. అదాని గ్రూప్​కే చెందిన కొన్ని కంపెనీలపై డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) కూడా దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే, అదాని గ్రూప్​లోని ఏ కంపెనీలపై ఈ దర్యాప్తు జరుగుతున్నదీ మాత్రం మంత్రి చెప్పలేదు. ఆరు మారిషస్​ ఫండ్స్​ అకౌంట్లను ఎన్​ఎస్​డీఎల్​ ఫ్రీజ్​ చేసిందనే రిపోర్టులతో కిందటి నెలలో అదాని గ్రూప్​లోని చాలా కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.  ఈ ఫండ్స్​ తమ మొత్తం పెట్టుబడులలో 90 శాతాన్ని అదాని గ్రూప్​ కంపెనీలలోనే పెట్టాయి. మూడు ఫండ్స్​ ఈ గ్రూప్​లో ఏకంగా 6 బిలియన్​ డాలర్ల దాకా పెట్టుబడులను పెట్టినట్లు సమాచారం. మారిషస్​ ఫండ్స్​ అకౌంట్ల ఫ్రీజ్​ మాట అబద్దమని జూన్​ 14న అదాని గ్రూప్​ ప్రకటించింది. అయితే, ఆ తర్వాత రోజు మాత్రం మూడు ఫండ్స్​ డీమాట్​ అకౌంట్లను  సస్పెండ్​ చేశారని చెప్పింది. దీంతో కన్​ఫ్యూజన్​ మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అదాని గ్రూపు కంపెనీల​ షేర్లు భారీగా పడ్డాయి. ఇది జరగడానికి ముందు 2020 నుంచి అదాని గ్రూప్​లోని లిస్టెడ్ కంపెనీల షేర్లు ఆరు రెట్లు దాకా పెరిగాయి. దీంతో సంపద విషయంలో ముకేశ్​ అంబానికి చాలా దగ్గరగా వచ్చారు గౌతమ్​ అదాని. మూడు మారిషస్​ కంపెనీల బెనిఫిషియరీ అకౌంట్ల ఫ్రీజ్​పై ఎలాంటి ఆర్డర్లనూ సెబీ జారీ చేయలేదని మంత్రి చౌదరి లోక్​సభలో స్పష్టం చేశారు. 

రూల్స్​ పాటిస్తున్నాం....అదాని గ్రూప్​

  సెబీ రెగ్యులేషన్స్​ అన్నింటినీ తాము పాటిస్తున్నామని అదానీ వివరణ ఇచ్చింది. సెబీ ఇటీవల  తమను ఏమీ అడగలేదని పేర్కొంది. ఐదేళ్ల కిందట అదాని పవర్​కు డీఆర్​ఐ  నోటీసు వచ్చిందని,  ఎక్విప్​మెంట్​ ఓవర్​ వాల్యుయేషన్ జరగలేదని డీఆర్​ఐ భావించిందని, ఈ అంశం ఇప్పుడు అప్పిలేట్​ ట్రిబ్యునల్​లో ఉందని తెలిపింది.

ఫస్ట్​ క్వార్టర్లో 36,191  కొత్త కంపెనీలు

దేశంలో ఏప్రిల్​–జూన్​ మధ్యలో కొత్తగా 36,191 కంపెనీలు ఏర్పాటయినట్లు అఫీషియల్​ డేటా చెబుతోంది. దీంతో జూన్​ నెలాఖరు నాటికి యాక్టివ్​గా ఉన్న మొత్తం కంపెనీల సంఖ్య 13.76 లక్షలకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కొత్త కంపెనీల ఏర్పాటు ఎక్కువైందని లోక్​సభలో కార్పొరేట్​ ఎఫెయిర్స్​ మినిస్టర్​ ఇందర్​జిత్ సింగ్​ వెల్లడించారు. అంతకు ముందు ఏడాది ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో 18,968 కంపెనీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. దేశంలోని కంపెనీలపై కరోనా వైరస్​ ప్రభావం ఏ మేరకు ఉందనే ఒక ప్రశ్నకు బదులు చెబుతూ ఈ వివరాలను ఆయన వెల్లడించారు. ఏజీఎంలను వీడియో కాన్ఫరెన్సింగ్​ ద్వారా పెట్టుకోవడంతో సహా పలు రకాల సపోర్టును కంపెనీలకు అందించినట్లు మినిస్టర్​ తెలిపారు. జూన్​ చివరిదాకా దేశంలో మొత్తం 21.87 లక్షల కంపెనీలు రిజిస్టరయ్యాయని, ఇందులో 13.76  లక్షల కంపెనీలు యాక్టివ్​గా ఉండగా, వివిధ కారణాల వల్ల  8.10 లక్షల కంపెనీలు యాక్టివ్​గా లేవన్నారు.

ఎకానమీ  రికవరవుతోంది

మన ఎకానమీ రికవరీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పంకజ్​ చౌదరి లోక్​సభకు చెప్పారు. ప్యాకేజీలు, క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ పెంపుదల, వ్యాక్సినేషన్​ డ్రైవ్​ల కారణంగానే ఎకానమీ పుంజుకుంటోందని పేర్కొన్నారు. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ క్యూ3లో జీడీపీ 0.5 శాతం, క్యూ4లో 1.6 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.  ఎకానమీ రికవరీపై సెకండ్​ వేవ్​ కొంత ప్రభావం చూపెట్టిందని ఆయన అన్నారు.