- హిజాబ్ వివాదంపై ఎస్ డీఎంసీ ప్రకటన
- సీఎఫ్ఐలో చేరాక తీరు మారిందని విమర్శ
- ఉడుపి జిల్లాలో 144 సెక్షన్ అమలు
ఉడుపి, హుబ్బళ్లి: గవర్నమెంట్ కాలేజీలో హిజాబ్ ధరిస్తామని ఇప్పుడు ఆందోళన చేస్తున్న గర్ల్స్.. అంతకుముందు స్కూల్ యూనిఫామ్తోనే క్లాసుకు వచ్చేవారని స్కూల్ డెవలప్ మెంట్ మేనేజ్ మెంట్ కమిటీ(ఎస్డీఎంసీ) వైస్ ప్రెసిడెంట్ యశ్పాల్ సువర్ణ చెప్పారు. క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(సీఎఫ్ఐ) సంస్థలో ట్రైనింగ్ తర్వాత వాళ్ల తీరు మారిపోయిందని తెలిపారు. టీచర్లను గౌరవించేవారు కాదని, పోయినేడాది నవంబర్ నుంచి హిజాబ్ కోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఆ అమ్మాయిలు అమాయకులని, సీఎఫ్ఐనే వాళ్లను ప్రేరేపించిందని సువర్ణ విమర్శించారు.
ఇయ్యాల్టి నుంచి స్కూళ్లు ఓపెన్
కర్నాటకలో హిజాబ్ వివాదంతో బందైన స్కూళ్లు.. సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఎలాంటి గొడవలు జరగకుండా ఉడుపి జిల్లాలో 144 సెక్షన్ విధించారు. హైస్కూళ్లకు 200 మీటర్ల పరిధిలో నిరసనలు, ర్యాలీలు, గ్యాదరింగ్స్ బ్యాన్ చేశారు. ఇది ఈ నెల 19 వరకు అమల్లో ఉంటుందని అధికారులు చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు తిరిగి ఎప్పటిలాగా నడిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు. స్టూడెంట్లు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
