న్యూఢిల్లీ: ఒక నెలలో నాలుగు ఫ్రీ విత్డ్రాయల్స్ పూర్తయితే, తర్వాత జరిగే ప్రతీ క్యాష్ విత్డ్రాపై ఛార్జీలను వసూలు చేస్తామని స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) అకౌంట్లకు సంబంధించి సర్వీస్ ఛార్జీలను సవరించింది. ఈ సవరించిన ఛార్జీలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఒక ఏడాదిలో 10 చెక్లను మించి వాడితే కూడా ఛార్జీలను విధిస్తామని స్టేట్ బ్యాంక్ పేర్కొంది. ‘జులై 1 నుంచి ఒక నెలలో ఫ్రీ క్యాష్ విత్డ్రాయల్స్ పూర్తయితే, ప్రతీ విత్డ్రాపై రూ. 15 నుంచి రూ. 75 వరకు ఛార్జీలను వసూలు చేస్తాం’ అని ఎస్బీఐ పేర్కొంది. ‘అదనపు వాల్యూ యాడెడ్ సర్వీసెస్’ కింద ఈ ఛార్జీలను వసూలు చేస్తారు. బ్యాంక్ బ్రాంచులు, ఏటీఎంల వద్ద జరిగే క్యాష్ విత్డ్రాయల్స్పై కూడా ఛార్జీలను విధిస్తారు. బ్రాంచులు, ఏటీఎంలు, క్యాష్ డిస్పెన్సింగ్ మెషిన్స్ (సీడీఎం) ల వద్ద జరిగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ల సర్వీస్లను ఫ్రీగా అందించనున్నారు.
సీనియర్ సిటిజన్స్కు చెక్ సర్వీస్లు ఫ్రీ..
ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 10 చెక్ లీవ్స్ (చెక్లు) సర్వీస్లను ఫ్రీగా అందిస్తామని ఎస్బీఐ ప్రకటించింది. వీటికి మించితే మాత్రం ఛార్జీలను వసూలు చేస్తామని పేర్కొంది. 10 చెక్లు ఉన్న చెక్బుక్పై రూ. 40 ప్లస్ జీఎస్టీ, 25 చెక్లు ఉన్న చెక్బుక్పై రూ. 75 ప్లస్ జీఎస్టీని, ఎమెర్జెన్సీ చెక్బుక్పై రూ. 50 ప్లస్ జీఎస్టీని వసూలు చేస్తామని స్టేట్బ్యాంక్ పేర్కొంది. చెక్ బుక్ సర్వీస్లకు సంబంధించి, సీనియర్ సిటీజన్ కస్టమర్లకు ఎటువంటి ఛార్జీలను విధించమని ప్రకటించింది. సాధారణంగా సేవింగ్స్ అకౌంట్లపై ఛార్జీలు తక్కువగా ఉంటాయి.
