హైదరాబాద్, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) పేరుతో ఏపీ సర్కారు ప్రిలిమినరీ రిపోర్టు పంపింది. కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణాబోర్డు పదే పదే డీపీఆర్ పంపాలంటూ లెటర్లు రాయడంతో నామ్కేవాస్తే డేటాతో నివేదిక ఇచ్చింది. కవర్ పేజీపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అని ప్రింట్ చేసిన 60 పేజీల బుక్లెట్ను అందజేసింది. డీపీఆర్ ఇచ్చాం, పర్మిషన్లు ఇవ్వాలన్నట్టుగా ఏపీ వ్యవహారశైలి కనిపిస్తోందని ఇంజనీర్లు అంటున్నారు.
కృష్ణా బోర్డుకు సంగమేశ్వరం డీపీఆర్
శ్రీశైలం ఫోర్ షోర్లోని సంగమేశ్వరం వద్ద నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఏపీ ప్రాజెక్టు చేపట్టింది. దానికి సంబంధించిన డీపీఆర్ ఇవ్వాలని మే నెలలోనే కృష్ణా బోర్డు ఏపీ సర్కారుకు లెటర్ రాసింది. దానిని ఏపీ పట్టించుకోలేదు. అయితే అక్టోబర్ 6న నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో డీపీఆర్ ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్ అంగీకరించారు. ఆ తర్వాత కూడా ఏపీ పెద్దగా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో.. త్వరగా పంపాలంటూ కృష్ణా బోర్డు మళ్లీ లెటర్లు రాసింది. డీపీఆర్ వందల పేజీలతో ఉంటుంది కాబట్టి హార్డ్ కాపీగా కాకుండా స్మార్ట్ కాపీగా ‘ఇ-పీఏఎంఎస్ ప్లాట్ ఫాం’పై పంపిస్తామని ఏపీ సర్కారు ఇంటర్నల్ కమ్యూనికేషన్స్లో తెలిపింది. కానీ చిన్న బుక్లెట్ పంపి తెలివి చూపించింది.
ప్రాజెక్టు ఉద్దేశాలకే ఎక్కువ స్పేస్
రాయలసీమ లిఫ్ట్ స్కీంను ఎందుకు చేపడుతున్నామో వివరించడంపైనే ఏపీ ఎక్కువగా ఫోకస్ చేసింది. దేశంలోనే అతితక్కువ వర్షపాతం ఉండే రాయలసీమకు తాగు, సాగునీటి భద్రత కోసమే ప్రాజెక్టు చేపడుతున్నామని పేర్కొంది. ఈ ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు లేదని.. ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి, తెలుగుగంగ ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకే చేపడ్తున్నామని వివరించింది. శ్రీశైలంలో ఫుల్ రిజర్వాయర్ లెవల్ (885 అడుగులు) ఉంటెనే పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి కెపాసిటీతో నీళ్లు తరలించగలమని పేర్కొంది. రిజర్వాయర్లో 854 అడుగుల లెవల్ మెయింటైన్ కాకుండా తెలంగాణ లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా నాగార్జునసాగర్కు నీటిని తరలిస్తోందని ఆరోపించింది. దానివల్ల రాయలసీమకు తాగు, సాగునీరు అందకుండా పోతోందని పేర్కొంది. దాంతో శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని తరలిస్తామని, ఈ ప్రాజెక్టుకు రూ.3,300 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని తెలిపింది. ఇవికాకుండా డీపీఆర్లో కీలకమైన అంశాలేవీ లేవు.
సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఏది?
ప్రాజెక్టు, లిఫ్ట్ స్కీం చేపట్టే ప్రాంతంలో సాయిల్ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా చేయిం చాలి. భూమి స్వభావమేంటి, ఎలాంటి నిర్మాణాలను తట్టుకుంటుంది, ఎంత లోతుతో ఫౌండేషన్ వేయాలన్న వివరాలు డీపీఆర్లో పేర్కొనాలి. కానీ ఏపీ రిపోర్టులో ఈ వివరాలేవీ లేవు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే మట్టి ఎంత.. నిర్మాణ ప్రాంతంలో ఎంతమేర మట్టి అందుబాటులో ఉంది.. మిగతా మట్టిని ఎక్కడి నుంచి తరలిస్తారన్న డేటా ఉండాలి. కాంక్రీట్ వర్క్ కంపోనెంట్స్ను విడి విడిగా వివరించాలి. ఏయే పనులకు ఎలాంటి ఐరన్ వాడాలి.. ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ పనుల వివరాలన్నీ తెలపాలి. కానీ ఏపీ ఈ విషయలేవీ చెప్పకుండానే డీపీఆర్ ఇచ్చామనిపించింది. ఏపీ రిపోర్టును పరిశీలించిన కృష్ణాబోర్డు.. పూర్తి డేటా ఇవ్వాలంటూ త్వరలో లెటర్ రాయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
