- అదనంగా ఆదాయం పొందే అవకాశం
- ఏడాదికి 3 నుంచి 6 శాతం వరకు రిటర్న్
బిజినెస్ డెస్క్, వెలుగు: డిజిటల్ గోల్డ్ కొన్న కస్టమర్లు ఇక నుంచి ఆ గోల్డ్ను లీజుకి ఇవ్వొచ్చు. అదనంగా ఆదాయం సంపాదించొచ్చు. ఇటువంటి టైప్ స్కీమ్ను డిజిటల్ గోల్డ్ అమ్మే సేఫ్గోల్డ్ మొదటిసారిగా కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. సాధారణంగా కస్టమర్లు డిజిటల్ గోల్డ్ కొన్నాక వారికి ఒక వాల్ట్ను కేటాయిస్తారు. ఈ వాల్ట్లో వారు కొన్న గోల్డ్ను స్టోర్ చేస్తారు. కస్టమర్లు తమ డిజిటల్ గోల్డ్ను జ్యువెలర్లకు రెంట్కు ఇద్దామని అనుకుంటే తమ వాల్ట్లోని గోల్డ్ను తీసి జ్యువెలర్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సేఫ్గోల్డ్ చెబుతున్న దాని ప్రకారం కస్టమర్లు తమ డిజిటల్ గోల్డ్పై ఏడాదికి 3 నుంచి 6% వరకు రెంట్ పొందొచ్చు. అలానే గోల్డ్ వాల్యూ పెరిగితే తమ డిజిటల్ గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇలాంటి స్కీమ్నే ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్) పేరుతో 2015 లో లాంచ్ చేసింది. ఈ స్కీమ్ కింద ప్రజలు తమ ఫిజికల్ గోల్డ్ను బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. వీరికి ఏడాదికి 0.50 % నుంచి 2.50 % వరకు (టైమ్ పీరియడ్ బట్టి) రిటర్న్ను బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. తర్వాత బ్యాంకులు ఈ ఫిజికల్ గోల్డ్ను జ్యువెలర్లకు లీజుకి ఇస్తాయి.
స్కీమ్ ఎలా పని చేస్తుందంటే?
గెయిన్స్ అనే పేరుతో డిజిటల్ గోల్డ్ను లీజుకి ఇచ్చే స్కీమ్ను సేఫ్గోల్డ్ తీసుకొచ్చింది. కస్టమర్లు ఈ కంపెనీ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్గా జ్యువెలర్లకు తమ డిజిటల్ గోల్డ్ను లీజుకి ఇవ్వొచ్చు. జ్యువెలర్ల లిస్టును సేఫ్గోల్డ్ ప్రొవైడ్ చేస్తుంది. వీరి దగ్గర నుంచి బ్యాంక్ గ్యారెంటీలను తీసుకున్నాక, వీరి బ్యాక్గ్రౌండ్ను చెక్ చేశాకనే వీరి లిస్టును కస్టమర్లకు ప్రొవైడ్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ స్కీమ్ కింద కస్టమర్లు కనీసం 0.5 గ్రాముల నుంచి గరిష్టంగా 20 గ్రాముల వరకు డిజిటల్ గోల్డ్ను లీజుకి ఇవ్వొచ్చు. కనీసం 30 రోజుల నుంచి గరిష్టంగా 365 రోజుల కోసం లీజుకి ఇవ్వాలి. ‘చాలా మంది కస్టమర్లు 90 నుంచి 180 రోజుల కోసం డిజిటల్ గోల్డ్ను లీజుకి ఇస్తున్నారు. ఏడాదికి 3 నుంచి 6 శాతం రిటర్న్ను కస్టమర్ అంచనా వేయొచ్చు’ అని సేఫ్గోల్డ్ ఎండీ గౌరవ్ మాథుర్ అన్నారు.
రాబడి రూపాయిల్లో కాదు..గోల్డ్లో
కస్టమర్కు ఇచ్చే రిటర్న్ను గోల్డ్ రూపంలోనే వారి అకౌంట్కు యాడ్ చేస్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎంఎస్ కూడా లీజు పీరియడ్ అయిపోయాక గోల్డ్ కాయిన్లు లేదా బులియన్ రూపంలో రిటర్న్ను ఇస్తోంది. సేఫ్గోల్డ్ తెచ్చిన ఈ కొత్త స్కీమ్ కూడా అలానే గోల్డ్ను రిటర్న్గా ఇస్తోంది. ఉదాహరణకు ఒక కస్టమర్10 గ్రాముల డిజిటల్ గోల్డ్ను జ్యువెలర్కు 3 నెలలకు గాను ఏడాదికి 3 శాతం రిటర్న్ దగ్గర లీజుకి ఇచ్చాడని అనుకుందాం. అప్పుడు లీజు పీరియడ్ పూర్తయ్యాక అతనికి 75 మిల్లిగ్రాముల రిటర్న్ (ఏడాదికి 300 మిల్లిగ్రాములు) వస్తుంది.
రిస్క్లూ ఉన్నాయ్..
ఈ స్కీమ్ను ఎంచుకునే కస్టమర్లు కొన్ని రిస్క్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
- డిజిటల్ గోల్డ్ను లీజుకి ఇవ్వడమనేది ఎటువంటి సంస్థల నియంత్రణల కిందకు రాదు. ఫ్రాడ్ జరిగినా లేదా డిజిటల్ గోల్డ్ లాస్ అయినా సెబీ, ఆర్బీఐ వంటి సంస్థలు సాయం చేయలేకపోవచ్చు.
- లీజు పూర్తి కాకముందు కస్టమర్లు తమ డిజిటల్ గోల్డ్ను అమ్మడానికి కుదరదు. లీజును క్యాన్సిల్ చేయలేం. జ్యువెలర్లు మాత్రం లీజును క్యాన్సిల్ చేయొచ్చు. జ్యువెలర్లు డిజిటల్ గోల్డ్ లీజులను క్యాన్సిల్ చేస్తే అప్పటి వరకు పొందిన రిటర్న్ను లెక్కించి కస్టమర్ అకౌంట్ను యాడ్ చేస్తారు. జీఎంఎస్లో మాత్రం లీజు టైమ్ పూర్తికాక ముందే బయటకు వచ్చేయొచ్చు. బ్యాంకులకు పెనాల్టీ కట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో రిటర్న్ను రూపాయిల్లో లేదా బులియన్లో చెల్లిస్తారు.
- లీజు టైమ్ పూర్తయినా కూడా కస్టమర్లు డిజిటల్ గోల్డ్ను తిరిగి ఇవ్వడానికి జ్యువెలర్లు ఇష్టపడకపోవచ్చు. కస్టమర్లు తమ డిజిటల్ గోల్డ్ను కోల్పోయే ప్రమాదం ఉంది. సేఫ్గోల్డ్ మాత్రం జ్యువెలర్ల నుంచి ముందుగానే బ్యాంక్ గ్యారెంటీలు తీసుకుంటామని చెబుతోంది.
