ఉక్రెయిన్​ అతిపెద్ద పోర్ట్​ సిటీ ఒడెస్సాపై రష్యా దాడులు

ఉక్రెయిన్​ అతిపెద్ద పోర్ట్​ సిటీ ఒడెస్సాపై రష్యా దాడులు

జపోరిజియా(ఉక్రెయిన్): ఉక్రెయిన్​లోనే అతిపెద్ద పోర్ట్​ సిటీ ఒడెస్సాపై రష్యా దాడులను పెంచింది. ఉక్రెయిన్​కు అమెరికా, యూరోప్​ దేశాలు పంపే మిలిటరీ సామగ్రి, ఆయుధాల సప్లయిని దెబ్బ తీయడమే లక్ష్యంగా రష్యా మిస్సైల్​ దాడులకు పాల్పడుతోంది. నల్ల సముద్రానికి దగ్గరలోని ఒడెస్సా సిటీపై రష్యా 7 మిస్సైల్స్​ను ప్రయోగించిందని ఉక్రెయిన్​ అధికారులు తెలిపారు. ఓ షాపింగ్ మాల్, వేర్​హౌస్​పై​ మిస్సైళ్లు పడటంతో ఒకరు చనిపోగా, పది మంది గాయపడ్డారని చెప్పారు. యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి నల్ల సముద్ర తీరంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తొలుత మరియుపోల్​ సిటీని టార్గెట్ చేసిన రష్యా.. ఇప్పుడు ఒడెస్సాపై దృష్టి పెట్టింది. సముద్ర తీరంపై పట్టుసాధిస్తే క్రిమియన్​ పెనిన్సులా, మాల్డోవా రీజియన్లకు సులువుగా వెళ్లడానికి రష్యాకు వీలవుతుంది. మరియుపోల్​లోని అజోవ్​స్టల్​ స్టీల్​ ప్లాంట్​ నుంచి సాధారణ పౌరుల తరలింపు పూర్తికావడంతో ప్లాంట్​పైనా రష్యా దాడులు చేస్తోంది. మరోవైపు, ఉక్రెయిన్​ బిల్లుపై అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ సంతకం చేశారు. ఉక్రెయిన్​కు మిలిటరీ, మానవతా సాయం కింద 33 బిలియన్​ డాలర్ల ప్యాకేజీ ఇవ్వాలని బైడెన్​ కోరగా, అమెరికన్​ కాంగ్రెస్​ నుంచి 40 బిలియన్ల ప్యాకేజీ ఇప్పించేందుకు డెమొక్రాట్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

బిల్డింగ్ శిథిలాల కింద 44 డెడ్ బాడీలు

మార్చిలో రష్యా దాడిలో కూలిపోయిన ఒక బిల్డింగ్​ శిథిలాల కింద 44 డెడ్​బాడీలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. ఖార్కివ్​ రీజియన్​లోని ఇజియం ప్రాంతం పై మార్చిలో రష్యా తీవ్రంగా దాడులు చేసింది. ఈ దాడిలో ఐదంతస్తుల భవనం కూలిపోయింది. లోపల చాలామంది చిక్కుకుపోయారు. తాజాగా చేపట్టిన శిథిలాల తొలగింపు ప్రక్రియలో 44 మృతదేహాలను గుర్తించినట్టు ఖార్కివ్​ రీజినల్​ అడ్మినిస్ట్రేషన్​ హెడ్  ఓలెహ్​ సైనెహ్​బోవ్​ 
సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.