ఉక్రెయిన్ లో భార‌తీయుల‌కు కీల‌క సూచ‌న‌లు

ఉక్రెయిన్ లో భార‌తీయుల‌కు కీల‌క సూచ‌న‌లు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌‌లో ఉద్రిక్తతల దృష్ట్యా అక్కడున్న ఇండియన్​ స్టూడెంట్స్, సిటిజన్స్​కు ఎంబసీ కీలక సూచనలు చేసింది. ఎక్కడివారు అక్కడే ఉండాలని కీవ్ లోని మన రాయబారి పార్థ సత్పతి ప్రకటన చేశారు. కీవ్‌‌కు ఎవరూ రావొద్దని సూచించారు. ఒక వేళ కీవ్ నగరంలో చిక్కుకున్నవారు ఉంటే వారి యూనివర్సిటీలు, స్థానిక భారతీయ గ్రూపులను సంప్రదించాలని కోరారు.  కీవ్‌‌ పశ్చిమ ప్రాంతాల నుంచి రాజధానికి బయలుదేరిన వారు ఉంటే తిరిగి ఆయా సిటీలకు వెళ్లిపోవాలని ఎంబసీ హెచ్చరించింది. ‘‘ఉక్రెయిన్‌‌లో ప్రస్తుతం అత్యంత అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లు, హోటళ్లు, హాస్టల్స్​లేదా ప్రయాణంలో.. ఇలా మీరు ఎక్కడున్నా ఆందోళన చెందకుండా, సేఫ్​గా ఉండండి’ అంటూ ఉక్రెయిన్‌‌లోని ఇండియన్​ఎంబసీ ఓ ప్రకటన రిలీజ్​చేసింది. గురువారం సాయంత్రం ఎంబసీ మూడోసారి సూచనలు జారీ చేసింది. ‘‘ సైరన్లు/బాంబు హెచ్చరికలు వస్తున్న ప్రాంతాల్లో ఉన్న ఇండియన్స్​గూగుల్ మ్యాప్స్ ఆధారంగా బాంబు షెల్టర్స్, బంకర్లలోకి వెళ్లండి”అని పేర్కొంది.  

ఆందోళనలో స్టూడెంట్స్
బాంబు దాడులతో ఉక్రెయిన్‌‌ వణికిపోతోన్న సమయంలో అక్కడ ఉన్న ఇండియన్​స్టూడెంట్స్, పౌరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వందలాది మంది ఉక్రెయిన్‌‌ ఎయిర్​పోర్టుకు చేరుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ‘‘ఉదయం గ్రోసరీ కోసం షాప్​కు వెళ్లగా.. పేలుడు శబ్దం వినిపించింది. కైవ్‌‌లోని నా స్నేహితులతో మాట్లాడినప్పుడు, నాలుగు ఐదు పేలుళ్లు వినిపించాయి. వారంతా భయాందోళనలో ఉన్నారు. కొందరు ఏడుస్తున్నారు’’ అని జునైద్ అనే ఇండియన్​స్టూడెంట్​ఉక్రెయిన్ లోని విన్నిట్సియా సిటీ నుంచి ఆవేదన వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్‌‌లో చిక్కుకున్న ఇండియాలోని వివిధ రాష్ట్రాల స్టూడెంట్లను సేఫ్​గా తీసుకురావడంపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. 
 
ఏర్పాట్లు చేస్తున్నం: కేంద్ర మంత్రి మురళీధరన్
ఉక్రెయిన్ లో చిక్కుకున్న18 వేల మంది సిటిజన్స్​ను దేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురళీధరన్​తెలిపారు. ‘‘స్టూడెంట్స్ సహా దాదాపు18 వేల మంది ఇండియన్స్​ను తిరిగి తీసుకురావడానికి విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్‌‌లోని ఎయిర్​స్పేస్​మూసివేసినందున, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్​భద్రతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది”అని ఆయన తెలిపారు.

మనోళ్లను సేఫ్​గా తీసుకొస్తం
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

న్యూఢిల్లీ, వెలుగు: ఉక్రెయిన్‌‌లో ఉన్న మనోళ్లను క్షేమంగా ఇండియాకు తీసుకొస్తామని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. కాగా, ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ స్టూడెంట్లకు  సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు న్యూఢిల్లీ తోపాటు తెలంగాణ సెక్రటేరియట్​లో ప్రత్యేక హెల్ప్ లైన్  కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ సోమేశ్ చెప్పారు.