ఇంటికెళ్లి 15 రోజుల్లో చెక్కు ఇవ్వాలని ఎమ్మెల్యే, కలెక్టర్లకు ఏపీ సీఎం జగన్ ఆదేశం
అమరావతి, వెలుగు: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు బాధితుల ఇంటికి వెళ్లి పరిహారం చెక్కు అందించాలని సూచించారు. పదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న 700 మంది రైతులకు పరిహారం చెల్లించేందుకు రిపోర్ట్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై జగన్ సమీక్షించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 15 రోజుల్లో పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతులతో సమానంగా ఏపీలోని అయిల్ ఫామ్ రైతులకు న్యాయం చేస్తామన్నారు. అయిల్ ఫామ్ రైతులకు చెల్లించేందుకు రూ.87 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతులకు సాగులో సలహాలు ఇచ్చేందుకు వైఎస్ ఆర్ అగ్రికల్చరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి పంచాయతీ పరిధిలోనూ ఒక భూసార పరీక్ష కేంద్రం, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో అగ్రికల్చరల్ ల్యా బ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులను విత్తనోత్పత్తికి ప్రోత్సహించి, ఏపీ సీడ్స్ డెవలప్ మెంట్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. గోదావరిలో మునిగిన బోటును వెలికితీసిన ధర్మాడి సత్యంను వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుకు ఎంపిక చేసినట్లు చెప్పారు.

