డిఫాల్టర్ల జాబితాలో
ఎయిర్లైన్, రియల్టీ కంపెనీలు
న్యూఢిల్లీ: దేశరాజధాని నుంచి బిజినెస్ చేసే కార్పొరేట్, సాధారణ కంపెనీలు కొన్ని భారీగా టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) ఎగ్గొట్టినట్టు ఐటీశాఖ ఆఫీసర్లు గుర్తించారు. ఈ కంపెనీల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. ఎగ్గొట్టిన టీడీఎస్ విలువను రూ.470 కోట్లుగా లెక్కగట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు టీడీఎస్ కట్టిందీ లేనిదీ తేల్చడానికి ఐటీ డిపార్ట్మెంట్ టీడీఎస్ వింగ్ ఓ కార్యక్రమం చేపట్టింది. ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో టీడీఎస్ వాటా 4-0 శాతం వరకు ఉంటుంది. హోటళ్లకు, గెస్ట్హౌజ్లకు అగ్రిగేటర్గా పనిచేసే ఒక కంపెనీ గత ఏడేళ్ల నుంచి టీడీఎస్ కట్టలేదని గుర్తించారు.
దీని విలువను రూ.280 కోట్లుగా గుర్తించారు. ఒక ఎయిర్లైన్ కంపెనీ రూ.115 కోట్లను ఎగ్గొట్టినట్టు తేలింది. కొన్ని రియల్టీ కంపెనీలు రూ.75 కోట్ల విలువైన టీడీఎస్ను చెల్లించలేదని గుర్తించారు. అయితే ఈ కంపెనీల పేర్లను బయటపెట్టడానికి ఐటీశాఖ ఇష్టపడలేదు. మరో 2 కేసుల్లో ఢిల్లీ కోర్టులు టీడీఎస్ను ఎగ్గొట్టినందుకు, తప్పుగా లెక్కించినందుకు ఆయా కంపెనీలకు జరిమానా వేశాయి.
