వెల్లడించిన ఆడిటింగ్ కంపెనీ
న్యూఢిల్లీ: అప్పుల కుప్పగా మారిన దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్)లో 2017–2019 మధ్యకాలంలో రూ.12,705 కోట్లు గోల్మాల్ అయ్యాయని ఆడిటింగ్ కంపెనీ గ్రాంట్ థార్న్టన్ వెల్లడించింది. గతంలో కంపెనీ చేపట్టిన రెండు స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (ఎస్ఆర్ఏ) కోసం ఇచ్చిన లోన్లలో అవకతవకలు జరిగాయని రిపోర్టులో పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్లో జరిగిన అక్రమాల నిగ్గుతేల్చడానికి గత ఏడాది ఈ కంపెనీ అడ్మినిస్ట్రేటర్ గ్రాంట్థార్న్టర్ను ఆడిటర్గా నియమించారు. కంపెనీ దివాలా పిటిషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ గత ఏడాది ఆమోదించింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ ఎండీ సీఈఓ ఆర్.సుబ్రమణియకుమార్ను డీహెచ్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఎస్ఆర్ఏ ట్రాన్సాక్షన్ల వల్ల కంపెనీ అప్పులు గత నవంబరు నాటికి రూ.12,705 కోట్లకు చేరాయని, వీటిలో అసలు రూ.10,979 కోట్లు కాగా, వడ్డీ రూ.1,723 కోట్లని డీహెచ్ఎఫ్ఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ ట్రాన్సాక్షన్లకు బాధ్యులుగా పేర్కొంటూ కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, దర్శన్ డెవెలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిగ్తియా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్తోపాటు ట్రాన్సాక్షన్ ఆడిటర్ ఇచ్చిన మరికొన్ని కంపెనీ పేర్లతో అడ్మినిస్ట్రేటర్ ఎన్సీఎల్టీలో అప్లికేషన్ అందజేశారు. ఆర్బీఐ గత ఏడాది డీహెచ్ఎఫ్ఎల్ను దివాలా ప్రక్రియకు పంపింది. ఒక ఫైనాన్షియల్ సర్వీసు కంపెనీ దివాలా కేసు ఎన్సీఎల్టీకి రావడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూలై లెక్కల ప్రకారం డీహెచ్ఎఫ్ఎల్ బ్యాంకులకు, ఎన్హెచ్బీకి, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలకు, బాండ్స్ హోల్డర్లకు రూ.83,873 కోట్లు బకాయిపడింది.
