అది 2014, వస్తువులు వేలం వేసే ఫ్రెంచ్ వ్యక్తి మార్క్ లబర్బేకు తన ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ‘ఇంట్లో అటక మీద ఓ పెయింటింగ్ కనబడింది. నీరు లీకై, దుమ్ము పడి చెత్తచెత్తగా తయారైంది. కానీ మంచి ధర పలకొచ్చు’ అని చెప్పాడు. అన్నదే ఆలస్యం మార్క్ వచ్చి వాలిపోయాడు. పెయింటింగ్ను నీరు, కాటన్ ఉన్ని తో తుడిచి శుభ్రం చేశాడు. దాని ఫొటోను పారిస్లోని ఆర్ట్ అప్రైజర్ ఎరిక్కు పంపాడు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత.. 2019.. లండన్ గ్యాలరీలో ఎరిక్ దాన్ని ప్రదర్శనకు ఉంచాడు. ఐదు అడుగులు పొడవు, ఆరు అడుగులు వెడుల్పుంది ఆ బొమ్మ. ఇటాలియన్ మాస్టర్ కరవాజ్జియో గీశాడు దాన్ని. 1607 నాటిదని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 27న పెయింటింగ్ ను వేలం వేస్తారట. రూ.1,200 కోట్లు పలకొచ్చంటున్నారు. బొమ్మ విషయానికొస్తే.. బెథులియా (బైబిల్లోని నగరం) నగరాన్ని అస్సిరియాన్ జనరల్ హొలొఫెర్నెస్ తన అధీనంలోకి తీసుకుంటాడు. నగరాన్ని కాపాడాలని నిర్ణయించుకున్న ఓ వితంతువు జుడిత్.. హొలొఫెర్నెస్ను తన వశం చేసుకుని కత్తితో అతని మెడను కోసేస్తుంది. ఈ కథంతా రోమన్ క్యాథలిక్, ఈస్టర్న్ ఆర్థొడాక్స్ వెర్షన్ పాత నిబంధనల్లో ఉంది.

