రోబో యాంకర్.. అచ్చం మనిషిలాగే వార్తలు చదివేస్తోంది..

రోబో యాంకర్.. అచ్చం మనిషిలాగే వార్తలు చదివేస్తోంది..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజాగా మీడియా రంగంలోకి దూసుకువ‌స్తున్నది.. అచ్చం మ‌హిళా యాంక‌ర్ లా ఉన్న రోబో గ‌డ గ‌డ వార్తలు చ‌దివి అంద‌ర్ని ఆశ్చర్యప‌రిచింది.. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో తెరపై కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదని, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారుచేసిన బొమ్మ అని తెలిసి జనం ఆశ్చర్యానికి గురయ్యారు. లేడీ యాంకర్ ను తలపించేలా గడగడా న్యూస్ చదివిన లీసా తీరు ఒడిశా ప్రజలను అబ్బురపరిచింది. ఒడిశాలో పేరొందిన న్యూస్ ఛానల్ ఓ టీవీ ఈ కొత్త యాంకర్ ను తన వీక్షకులకు పరిచయం చేసింది. ఒడిశాలో తొలి ఏఐ యాంకర్ ‘లిసా’తో వార్తలు చెప్పించింది.

ఆ ఛానల్ స్థాపించి  25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐ న్యూస్‌ యాంకర్‌ను పరిచయం చేశామని  యాజమాన్యం తెలిపింది.  ఈ మేరకు రోబో యాంకర్  ఆవిష్కరణ కార్యక్రమం భువనేశ్వర్‌లో ఆదివారం ( జులై 9)  జరిగింది.  ఒడియాలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని.. అయినప్పటికీ మేం దాన్ని సాధించాం.. మనుషులు మాట్లాడేంత స్పష్టంగా ఉచ్చారణ లేకపోయినా.. గూగుల్‌ అసిస్టెంట్‌ కంటే మెరుగ్గానే ఉంటుంది.. త్వరలోనే ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా తయారు చేస్తామని ఛానల్ ఎండీ తెలిపారు.

ఒడియాతో పాటు ఇంగ్లిష్ లోనూ వార్తలు చదివేలా లీసా ను ప్రోగ్రామ్ చేసినట్లు ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి మొట్టమొదటి ఏఐ యాంకర్ ను పరిచయం చేసిన ఘనత తమకే దక్కుతుందని ఆమె వివరించారు. లీసాకు బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లిష్ వార్తలపైనే దృష్టి పెట్టామని చెప్పారు. టీవీ బ్రాడ్ కాస్టింగ్ రంగంలో ఏఐ వాడకం ఇప్పుడిప్పుడే మొదలైందని, భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను చేరుకుంటుందని  పేర్కొన్నారు.