- ఆన్లైన్ కంపెనీలను కోరిన ప్రభుత్వం
కిరాణా షాపులకు ఏ విధంగా సాయపడగలరో చెప్పాలని పెద్ద ఆన్లైన్ కంపెనీలను ప్రభుత్వం కోరుతున్నట్లు తెలుస్తోంది. కిరాణా షాపులు ఎదిగేందుకు ఏం చేయగలదో తెలపమంటూ ఫ్లిప్కార్ట్, అమెజాన్, శ్నాప్డీల్, జొమాటో, స్విగ్గీ, బిగ్బాస్కెట్లకు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) లెటర్ రాసింది. ఇందుకోసం ఒక విధానాన్ని రూపొందించాలనుకుంటున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశం మీద మాట్లాడేందుకు కోరగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ, బిగ్బాస్కెట్లు సమాధానమివ్వలేదు. ఈ నెల 5 న జరిగిన మీటింగ్లో అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ల మధ్య కిరాణా షాపుల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సెయిట్)తో కలిసి పనిచేయాల్సిందిగా కూడా గోయెల్ అమెజాన్ ఇండియాను కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, టాప్ సెల్లర్లు, వారికి సంబంధించిన పన్నుల వివరాలను ఇవ్వాలని పీయూష్ గోయెల్ అడిగినట్లు సమాచారం. ఇండియాలో భవిష్యత్లో పెట్టబోయే పెట్టుబడులు, అకౌంటింగ్ స్టాండర్డ్స్ను వెల్లడించాలని కూడా అమెజాన్ను కోరారు. భారీ డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా అడ్డగోలు ధరలకు అమ్మకాలు సాగిస్తున్నాయంటూ అమెజాన్, ఫ్లిప్కార్ట్లపై సెయిట్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇలా చేయడం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్డీఐ) రూల్స్కు విరుద్ధమని సెయిట్ వాదిస్తోంది. దేశంలోని అసంఘటిత రిటైల్ (కిరాణా షాపులు) రంగ సమస్యలను పరిష్కారానికి, రెండు వర్గాలకూ ప్రయోజనం కలిగించేలా అది ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

