- కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్లు వెళ్లిపోయినా, రిటైల్ ఇన్వెస్టర్ల షాక్ అబ్జార్బర్లలా పనిచేస్తూ దానిని నిలబెడుతున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మహమ్మారి సమయంలో రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య చాలా పెరిగిందని అన్నారు. “రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీళ్లు మార్కెట్కు షాక్ అబ్జార్బర్ల వలె పనిచేస్తున్నారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ)లు దూరంగా వెళ్లిపోయినా మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులు కనిపించలేదు. ఎందుకంటే దేశంలోని చిన్న పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు” అని ఆమె చెప్పారు. ఈ ఏడాది మార్చిలో, యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఆరు కోట్ల మార్కును తాకినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ తెలిపిన నేపథ్యంలో ఈమె ఈ కామెంట్స్ చేశారు. ఇటీవల పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, యుద్ధం వంటి ఒత్తిళ్లను అరికట్టడానికి ఆర్బీఐ రెపోరేట్లను పెంచింది. మానిటరీ పాలసీని కఠినతరం చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువ అవుతున్నాయి. విదేశీ పోర్ట్ఫోయో పెట్టుబడిదారులు అమ్మకాల జోరును కొనసాగిస్తున్నారు.
టెక్నాలజీ దుర్వినియోగాన్ని ఆపండి
టెక్నాలజీని దుర్వినియోగం కాకుండా ఉండేలా డిజిటలైజేషన్ను అర్థం చేసుకోవాలని రెగ్యులేటర్లకు ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా సూచించారు. సైబర్దాడుల వంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఫైర్వాల్ మెకానిజం తప్పనిసరి అని అన్నారు. న్యాయమైన, జవాబుదారీ పద్ధతులను అమలు చేయాలని అన్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా ఉండేలా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చూడాలని నిర్మలా సీతారామన్ సూచించారు.
