వరుసగా రెండో ఏడాది గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. వైరస్ ఉధృతంగా వ్యాపిస్తుండటంతో ఈ ఏడాది కూడా వేడుకలను ఎలాంటి ఆడంబరాలు లేకుండానే జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈసారి వేడుకల్లో భారీ మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రిపబ్లిక్ డే పరేడ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సాధారణంగా ఏటా ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే పొగమంచు కారణంగా ఈ సారి ఉదయం 10.30 గంటలకు పరేడ్ను మొదలుపెట్టాలని రక్షణ శాఖ నిర్ణయించింది. జనవరి 26న ఢిల్లీలో మంచు దుప్పటి పరుచుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ప్రేక్షకులు పరేడ్ను చూసేందుకు వీలుగా అరగంట ఆలస్యంగా పరేడ్ను ప్రారంభించాలని నిర్ణయించామని ప్రకటించింది. అంతేగాక, రాజ్పథ్ మార్గంలో రెండు వైపులా ఐదు ఎల్ఈడీ స్క్రీన్ల చొప్పున 10 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.
పరేడ్ ప్రారంభానికి ముందు ముందు గత గణతంత్ర దినోత్సవాలకు సంబంధించిన వీడియోలు, సాయుధ బలగాలపై తీసిన షార్ట్ ఫిల్మ్స్, ఇతర స్ఫూర్తిదాయక వీడియోలను ఈ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత పరేడ్ మొదలవగానే ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది.
మరిన్ని వార్తల కోసం..
