ముంబై: ఆన్లైన్ బిజినెస్కు కొత్త కంపెనీ ఏర్పాటు నేపథ్యంలో మంగళవారం రిలయన్స్ షేర్లు జీవితకాలపు గరిష్ట స్థాయి రూ. 1,471 కి ఎగిశాయి. డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు కోసం హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ నెలకొల్పనున్నట్లు అంతకు ముందు రిలయన్స్ చేసిన ప్రకటనతోనే షేర్ల ధర పెరిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఆప్షనల్లీ కన్వర్టిబుల్ డిబెంచర్ల ద్వారా సబ్సిడరీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 1.08 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంతేకాదు, ఈ సబ్సిడరీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను తీసేసుకుంటుంది. కొత్త ఏర్పాట్లతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ మార్చి 2020 నాటికి అప్పులు లేని కంపెనీగా అవతరిస్తుంది.
ఈ కంపెనీకి స్పెక్ట్రమ్ సంబంధిత బాకీలు మాత్రమే మిగులుతాయి.” మేం ఏర్పాటు చేసిన డిజిటల్ ఎకో సిస్టమ్ పరిమాణం చూసి, వ్యూహాత్మక ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. మా ప్లాట్ఫామ్ కంపెనీలో సరైన భాగస్వాములను ఎంచుకుంటాం. ఆర్ఐఎల్ వాటాదారులకు అర్ధవంతమైన ప్రతిఫలాలు తెచ్చేలా ప్రయత్నిస్తాం” అని ఈ సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు. వాటా అమ్మకానికి ముందుగానే రిలయన్స్ జియోను డిజిటల్ మేజర్గా తీర్చిదిద్దుతున్నట్లు సీఎల్ఎస్ఏ తెలిపింది. ఆప్షనల్లీ కన్వర్టిబుల్ డిబెంచర్ల కన్వర్షన్ ధర ప్రకారం చూస్తే డిజిటల్ బిజినెస్ వ్యాల్యుయేషన్ 65–70 బిలియన్లకు చేరినట్లేనని పేర్కొంది.
