ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి
పంజాబ్ , హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రిలయన్స్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న జియో మొబైల్ టవర్ల విధ్వంసాన్ని వెంటనే ఆపాలంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL).. పంజాబ్ , హర్యానా కోర్టులను ఆశ్రయించింది. గత కొన్ని వారాలుగా జియో ప్రోపర్టీస్ మీద జరుగుతున్న విధ్వంసంపై ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని.. పంజాబ్, హర్యానా హైకోర్టులో రిలయెన్సు జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ద్వారా పిటిషన్ దాఖలు చేసింది.
విధ్వంసక చర్యల వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తమ సంస్థలలో పని చేసే వేలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడవేసినట్టయిందని పిటిషన్లో పేర్కొంది. రైతు చట్టాలపై, రిలయన్స్ సంస్థలపై తీవ్ర కోపంతో ఉన్న రైతులు.. గత కొన్ని వారాలుగా రోజుకి 200 కు పైగా టవర్లను ధ్వంసం చేస్తున్నారని పిటిషన్ లో తెలిపింది.
కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలతో రిలయన్స్ కు ఎలాంటి సంబంధం లేదని, వాటి వల్ల తమ సంస్థలకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదని RIL సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ చట్టాల కారణంగా రిలయన్స్ ఆస్తులకు నష్టం వాటిల్లించండం , తమ వ్యాపారాలకు హాని కలిగించడం, తమ ప్రతిష్టను దెబ్బతీయడం.. ఓ దుర్మార్గపు చర్యగా తెలిపింది.
