ప్రపంచంలోనే ఎంతో చల్లగా ఉండే ఆర్కిటిక్ సర్కిల్, గ్రీన్ల్యాండ్లలో ఉవ్వెత్తున ఎగిసిన ఎర్రటి మంటలివి. ఆర్కిటిక్ సర్కిల్లో ఉండే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, డెన్మార్క్, ఐస్ల్యాండ్లను ప్రపంచంలో చల్లటి ప్రదేశాలుగా చెబుతుంటారు. కానీ, ఇప్పుడు ఆ చల్లటి ప్రాంతాల్లోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో కార్చిచ్చు రాజుకుంది. అక్కడ భారీగా పెరుగుతున్న టెంపరేచర్లే ఇంతటి మంటలకు కారణమవుతున్నాయి. ఆర్కిటిక్ సర్కిల్లో ఇంతటి మంటలు ఎప్పుడూ రాలేదని, కార్చిచ్చు రాజుకోవడాన్ని కనీసం ఊహించుకోనూ లేదని కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ సీనియర్ సైంటిస్ట్ మార్క్ పారింగ్టన్ చెప్పారు. అలస్కా, సైబీరియా, కెనడాల్లో వీస్తున్న వడగాడ్పులే అందుకు కారణమవుతున్నాయన్నారు. ఈ మంటల వల్ల గ్రీన్ల్యాండ్లోని ఐస్ కూడా వేగంగా కరిగిపోతోంది.
ఒక్క రోజే 1200 కోట్ల టన్నులు..
గురువారం ఒక్క రోజే 1200 కోట్ల టన్నుల గ్రీన్ల్యాండ్ ఐస్ కరిగి నీరుగా మారిపోయింది. ఆ నీళ్లన్నీ సముద్రంలో కలిసిపోయాయి. జులై 31న ఎన్నడూ లేనంతగా 60 శాతం ఐస్ షీట్ కరిగిపోయింది. జులై మొత్తంలో దాదాపు 19,700 కోట్ల టన్నుల మంచు కరిగి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోయాయని డెన్మార్క్ వాతావరణ కేంద్రం నిపుణుడు రూత్ మోట్రమ్ తెలిపారు. ఒక నెలలో సముద్ర మట్టం 0.01 మిల్లీమీటర్ పెరగడానికి ఈ నీళ్లు చాలని చెప్పారు. సముద్ర మట్టం పెరిగే కొద్దీ తుఫాన్లు పెరిగిపోతాయని, దాని వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.
