- భర్తపై భార్య పోటీ..
- సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇంట్లోనే ప్రత్యర్థి
- రాజస్థాన్లోని దంతా రామ్గఢ్లో దంపతుల పోరు!
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దంతా రామ్గఢ్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ భార్యాభర్తలు తలపడుతుండటమే అందుకు కారణం. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ్ సింగ్ కుమారుడు వీరేంద్ర సింగ్.. దంతా రామ్గఢ్ నియోజకవర్గం ఎమ్మెల్యే. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంది.
అయితే, ఆయన భార్య రీటా చౌధరీ కూడా ఇదే స్థానం నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి రీటా భంగపడ్డారు. దీంతో 2023 ఆగస్టులో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)లో చేరారు.
ఈ క్రమంలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దంతా రామ్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా రీటా చౌధరీని జేజేపీ ప్రకటించింది. మరోవైపు, కాంగ్రెస్ కూడా వీరేంద్ర సింగ్కే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో భార్యాభర్తలు ప్రత్యర్థులుగా తలపడనున్నారు.
