గురుద్వారాలపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. బహిష్కరించిన పార్టీ

గురుద్వారాలపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. బహిష్కరించిన పార్టీ

సిక్కుల పవిత్రస్థలం గురుద్వారాలపై రాజస్థాన్ బీజేపీ నేత సందీప్ దాయామా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సందీప్ వ్యాఖ్యలపై సిక్కు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, సందీప్ దయామాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరు సందీప్ దయామాను పార్టీ నుంచి బహిష్కరించినట్లు రాజస్థాన్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ చెప్పారు. 

ఇటీవల రాజస్థాన్ లోని అల్వార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సందీప్ దయామా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నిర్మించిన మసీదులు, గురుద్వారాలు భవిష్యత్తులో ఇబ్బందిగా మారుతాయని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పారు.

పంజాబ్‌కి చెందిన నేతలు శాంతించలేదు. సందీప్ వ్యాఖ్యల్ని క్షమించలేమని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ చెప్పారు. సందీప్ దయామాపై చర్యలు తీసుకోవాలని అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. పంజాబ్ బీజేపీ మహిళా విభాగం చీఫ్ జై ఇందర్ కౌర్ చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.