200 మంది సభ్యుల రాజస్థాన్ అసెంబ్లీకి ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎర్లీ ట్రెండ్స్ రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోందని, ఇప్పటికే సగం మార్కును దాటిందని చూపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మాత్రం 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తొలి ఆధిక్యత ప్రకారం టోంక్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. అయితే, సర్దార్పూర్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆధిక్యంలో ఉన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతి ఐదేళ్లకు తిప్పే 30 ఏళ్ల సంప్రదాయాన్ని తుంగలో తొక్కి అధికారాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ.. పాత పార్టీని గద్దె దించాలని చూస్తోంది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ హోరాహోరీ పోటీని అంచనా వేసింది. కాంగ్రెస్కు 86–106 సీట్లు వచ్చే అవకాశం ఉందని, బీజేపీ 80–100 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది.
నవంబర్ 25న జరిగిన ఎన్నికలకు 1,862 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, మొత్తం ఓటర్ల సంఖ్య 5,25,38,105. కరణ్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందడంతో ఎన్నికలు వాయిదా పడినందున 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది.
