బాసెల్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. స్విస్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో సెకండ్ సీడ్ సింధు 21–16, 21–8తో బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ (థాయ్లాండ్)పై గెలిచింది. బుసానన్తో ఇప్పటివరకు ఆడిన 17 మ్యాచ్ల్లో తెలుగమ్మాయి 16సార్లు విజేతగా నిలిచింది. . అద్భుతమైన ర్యాలీలతో పాటు క్రాస్ కోర్టు విన్నర్స్తో 49 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. స్టార్టింగ్లోనే అటాకింగ్ గేమ్ మొదలుపెట్టిన హైదరాబాదీ షట్లర్.. 3–0తో లీడ్ను సాధించింది. కానీ ర్యాలీలతో ఆకట్టుకున్న బుసానన్ 7–7తో స్కోరు సమం చేసింది. దీంతో అప్రత్తమైన సింధు క్రాస్ కోర్టు షాట్స్తో రెండు పాయింట్ల లీడ్ ఉండేలా చూసుకుంది. బుసానన్ డ్రాప్ షాట్స్తో ఇబ్బందిపెట్టినా.. సింధు అద్భుతమై రిటర్న్స్తో అలరించింది. స్కోరు 13–13 వద్ద సింధు ఐదు పాయింట్లు నెగ్గి 18–16 లీడ్ సాధించింది. ఆ వెంటనే మూడు బ్యాక్లైన్ షాట్స్తో గేమ్ను సొంతం చేసుకుంది. సెకండ్ గేమ్లో 5–0తో మొదలైన లీడ్ ఎక్కడా బ్రేక్ కాలేదు. 12–4 వద్ద 8 పాయింట్లు నెగ్గింది. ఈ దశలో నాలుగు పాయింట్లు ప్రత్యర్థికి సమర్పించుకున్నా.. డ్రాప్ షాట్తో మ్యాచ్ను సాధించింది. మెన్స్ సింగిల్స్లో హెచ్.ఎస్. ప్రణయ్ 12–21, 18–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు.
