ఆర్థిక వ్యవస్థ గత ఏడాది నుంచి నెమ్మదించడం మొదలైనప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్లు)పై రాబడులు తగ్గిపోతూనే ఉన్నాయి. కీలకమైన ఈక్విటీ ఎంఎఫ్ విభాగాలు గత ఐదేళ్లలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీ కంటే తక్కువ రాబడులను ఇవ్వడం గమనార్హం. మరో సంగతి ఏమిటంటే స్టాక్మార్కెట్ల లాభనష్టాల ఆధారంగా రాబడులు ఇచ్చే ఎంఎఫ్లతో రిస్క్ ఎక్కువ. పీపీఎఫ్ పూర్తిగా సురక్షితమైన డెట్ ఇన్వెస్ట్మెంట్. పన్ను మినహాయింపులూ ఉంటాయి. అయితే, గత ఐదేళ్లలో ఎంఎఫ్లపై అవగాహన పెరిగింది. ప్రభుత్వం కూడా ఆర్థికరంగంలో మరిన్ని సంస్కరణలు తెస్తామని భరోసా ఇవ్వడంతో చాలా మంది ఎంఎఫ్లలో ఇన్వెస్ట్ చేశారు. పీపీఎఫ్పై వడ్డీరేటును ప్రతి క్వార్టర్కు ఒకసారి సవరిస్తారు. వడ్డీరేటు దాదాపు 7.5–9 శాతం మధ్యలో ఉంటుంది. 2014–19 మధ్యకాలంలో పీపీఎఫ్ సగటు రేటు 8.21 శాతం. ఇదేకాలంలో లార్జ్, మల్టీక్యాప్, ఈఎల్ఎస్ఎస్ (ట్యాక్స్ సేవింగ్) ఫండ్స్ విలువ వరుసగా 7.79%, 8.57 %, 8.53 శాతానికి తగ్గింది. ఈ లెక్కలన్నీ గత నెల 30 నాటి వరకు ఉన్నవి. మిడ్క్యాప్, స్మాల్ వంటి ఇతర కేటగిరీల ఎంఎఫ్లు ఏడాదికి వరుసగా 9.51 శాతం, 9.39 శాతం రాబడులను ఇచ్చాయి. వీటిపై పన్నులను మినహాయిస్తే వాస్తవిక రాబడి పీపీఎఫ్ వడ్డీ కంటే తక్కువ ఉంటుందని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన ఇన్వెస్ట్మెంట్లు
ఓపెన్ ఎండెండ్ ఈక్విటీ ఫండ్స్ అధీనంలోని అసెట్స్ 2014లో 2.5 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది జూలై నాటికి వీటి విలువ రూ.6.84 లక్షల కోట్లకు చేరింది. అంటే ఐదేళ్లలో ఇన్వెస్టమెంట్ల విలువ మూడురెట్లు పెరిగింది. అయితే ఏయూఎం పెరుగుదల మాత్రం 1.5 రెట్లు మించలేదు. ఈక్విటీ ఫండ్లలో 90 శాతం మంది ఇన్వెస్టర్లు వ్యక్తులే. జీడీపీ తగ్గిపోవడం, దీని ప్రభావం స్టాక్మార్కెట్పై పడటం వల్ల వీరి ఫండ్స్ నెట్ అసెట్ వాల్యూ బాగా తగ్గింది.
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లు ఒడిదుడుకులకు లోను కావడం సహజమే! అయితే ఇన్వెస్టర్లు ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో రికవరీకి అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక లక్ష్యాలపైనే శ్రద్ధ చూపాలి. తొందరపడి ఎంఎఫ్ యూనిట్లను అమ్ముకోకూడదు.

