బిజినెస్ డెస్క్,వెలుగు:పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (పోస్ట్ ఆఫీస్ ఆర్డీ) ఎలాంటి రిస్కూ లేని పొదుపు స్కీమ్. డిపాజిటర్లు కనీసం ఐదేళ్ల కాలానికి తమ డబ్బును పొదుపు చేయాలి. చిన్న మొత్తాలు పొదుపు చేయడానికి ఎంతో అనువుగా ఉంటుంది. మంచి రాబడినీ ఇస్తుంది. సంబంధిత టెన్యూర్ ప్రకారం డిపాజిటర్లకు వడ్డీని చెల్లిస్తారు.
ఖాతా తెరవడం
లబ్ధిదారుడు తప్పనిసరిగా భారతీయుడు అయి ఉండాలి.18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. 10–-18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారితో జాయింట్ ఖాతాను తెరవడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంతకాలు అవసరం. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతాను తెరవడం చాలా సులభం. పోస్టాఫీసులో ఇనీషియల్ డిపాజిట్ పే-ఇన్ స్లిప్తో పాటు ఆర్డీ ఫారమ్ను సమర్పించాలి. ఖాతా తెరవడానికి కనీస మొత్తం నెలకు రూ.10 పొదుపు చేయాలి. గరిష్ట మొత్తానికి లిమిట్ లేదు.
టెన్యూర్
పోస్టాఫీస్ ఆర్డీ మెచ్యూరిటీ గడువు కనీసం ఐదు సంవత్సరాలు ఉంటుంది. దీనిని మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. మొత్తం టెన్యూర్ 10 సంవత్సరాలు అవుతుంది. నెలకు ఒకసారి డబ్బు డిపాజిట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ ఆర్డీపై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.2 % ఉంది. మూడు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు. స్కీమ్ పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు. కనీసం ఆరు నెలలు ముందుగా చేసిన పెట్టుబడులకు రిబేట్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తం ఆరు నెలల వాయిదాలకు సమానంగా ఉంటే మాత్రమే రాయితీ ఇస్తారు.
ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్
ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్కు అవకాశం ఉంటుంది. డిపాజిటర్ ఒక సంవత్సరం తర్వాత పెట్టుబడిలో 50శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. విత్డ్రా చేసిన మొత్తంపై ఒకశాతం ఛార్జీ విధిస్తారు. ఆర్థికంగా ఎదిగేందుకు రికరింగ్ డిపాజిట్ మంచి పెట్టుబడి అని ఎనలిస్టులు చెబుతారు.
