- నిందితులను ఇండియా గేట్, సదర్ బజార్కు తీసుకెళ్లిన అధికారులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసుకు సంబంధించి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. దాడికి ముందు నిందితులు ఎక్కడెక్కడ తిరిగారో వారిని అక్కడికి తీసుకెళ్లారు. పార్లమెంట్లో దాడి చేసిన సాగర్ శర్మ, మనోరంజన్లను బుధవారం సదర్ బజార్కు తీసుకెళ్లారు. అక్కడ వారు ఇండియా ఫ్లాగ్లను కొనుగోలు
చేసినట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారు సమావేశమైన ఇండియా గేట్ వద్దకు నిందితులను తీసుకెళ్లారు.
అక్కడే ప్రధాన నిందితుడు అందరికి జాతీయ జెండాలు, పొగ డబ్బాలను ఇచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం సాగర్, మనోరంజన్లను న్యూఫ్రెండ్స్ కాలనీలోని మహారాణి బాగ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పార్లమెంట్లో తమ ప్లాన్ను అమలు చేసే విషయంపై చర్చించారని పోలీసులు వెల్లడించారు. కాగా, పార్లమెంట్ భద్రత ఉల్లంఘనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు సాగర్శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండే, లలిత్ ఝా, మహేశ్ కుమావత్లను అరెస్ట్ చేశారు.
