భారత్ ఎకానమీ పుంజుకుంటోంది
ఎకానమీలో రికవరీ సంకేతాలు
గత ఆరేళ్లలో అనేక సంస్కరణలు
న్యూఢిల్లీ: ఆసియాలో మూడో అతిపెద్ద ఎకానమీగా ఉన్న ఇండియా, ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ కాంపిటీటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ను అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో వ్యాపార అవకాశాలు భారీగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టమని గ్లోబల్ కంపెనీలకు పిలుపిచ్చారు. ‘ప్రపంచంలో అతి పెద్ద ఓపెన్ ఎకానమీ(ఇతర దేశాలతో ట్రేడింగ్ చేస్తున్న దేశాలు)లలో ఇండియా ఒకటి. ఇండియాలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి గ్లోబల్ కంపెనీలకు మేము రెడ్కార్పెట్ వేస్తున్నాం. చాలా కొద్ది ఆర్ధిక వ్యవస్థలు మాత్రమే ఇలాంటి అవకాశాలను ఇవ్వగలవు’ అని అన్నారు. ఇండియా గ్లోబల్ వీక్2020లో వర్చ్యువల్గా పాల్గొన్న ఆయన పై విధంగా మాట్లాడారు. ఆర్ధిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని, దీనర్థం కరోనా సంక్షోభం నుంచి బయటపడుతున్నామని చెప్పారు. వ్యవసాయం, డిఫెన్స్, స్పేస్ సెక్టారర్లలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి మోడీ ప్రస్తావించారు. ఇండియా రికవరీతో గ్లోబల్ రికవరీ.. ఏదైనా సంక్షోభం నుంచి గ్లోబల్ ఎకానమీ తిరిగి పుంజుకోవడం, ఇండియా ఎకానమీ రికవరీకి లింక్ అయి ఉంటుందని మోడీ చెప్పారు. అసాధ్యం అనుకున్నవాటిని సాధించాలనుకునే మనస్తత్వం ఇండియన్లకు ఉందని పేర్కొన్నారు. ‘ఇప్పటికే ఎకానమీలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు’ అని అన్నారు. ఒక చేతితో ఇండియా కరోనా మహమ్మారితో పోరాడుతోందని, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నా రు. మరోవైపు దేశ ఆర్ధిక వ్యవస్థ పై కూడా అంతలానే దృష్టి సారిస్తున్నామని చెప్పారు. సోషల్గా లేదా ఆర్థికంగా ఎటువంటి సమస్యలొచ్చినా ఇండియా వాటిని అధిగమించిందని, చరిత్రే దీనికి రుజువని మోడీ పేర్కొన్నారు. హౌసింగ్, ఇన్ఫ్రా, కన్స్ట్రక్షన్, ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్, జీఎస్టీ వంటి సాహసోపేతమైన ట్యాక్స్ సంస్కరణలు, ఇండివిడ్యువల్స్ కు, బిజినెస్ల కు ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అందుబాటులో ఉండేలా చేయడం వంటి ఏరియాలలో గత ఆరేళ్లలో గ్రోత్ను నమోదు చేశామని చెప్పారు. ఆత్మ నిర్భర్ అంటే మూసుకుపోవడం కాదు.. ప్రస్తుత కరోనా సంక్షోభంలో పేదలకు అండగా ఉండడం కోసం ఫ్రీగా కుకింగ్ గ్యాస్, రేషన్, క్యాష్ను అందిస్తూ ఆత్మ నిర్భర్ ప్యాకేజిని ప్రభుత్వం తీసుకొ చ్చిన విషయం తెలిసిందే. ‘మన రిలీఫ్ ప్యాకేజి పేదవాళ్ల కోసం తెచ్చింది. టెక్నాలజీ సాయంతో ప్రతీ రూపాయి అర్హులైన ప్రతి ఒక్కరికి డైరక్ట్ గాచేరింది’ అని మోడీ అన్నారు. ‘ఆత్మ నిర్భర్ అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా మూసుకుపోవడం కాదని, ఆత్మ నిర్భర్ అంటే స్వంతంగా నిలబడడం.. సొంతంగా జనరేట్ చేసుకోవడం’ అని పేర్కొన్నారు.
అవకాశాలు పెరిగాయ్
ఇండియాలోని చాలా రంగాలలో అనేక అవ కాశాలున్నాయని మోడీ చెప్పారు. వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల వలన స్టోరేజి, లాజిస్టిక్ వంటి విభాగాలలో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశాలు ఏర్పడ్డాయ న్నారు. ‘ఇన్వెస్ట ర్లకోసం మేము తలుపు తెరిచే ఉంచాం. వచ్చి డైరక్ట్ గా ఇన్వెస్ట్ చేయండి’అని గ్లోబల్ కంపెనీలను కోరారు. దీంతోపాటు దేశ చిన్న పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగంలో కూడా అనేక సంస్కరణలు తెచ్చామని, పెద్ద పరిశ్రమలకు ఈ సెక్టార్ చాలా కీలకమని అన్నారు. డిఫెన్స్ సెక్టార్లో పెట్టుబడులు పెట్ట డానికి అవకాశాలు ఏర్పడ్డాయని, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్లోని కొన్ని భాగాలలో ప్రైవేట్ సెక్టార్ కోసం తలుపులు తెరిచామని చెప్పారు. వీటితో పాటు స్పేస్(అంతరిక్షం) సెక్టార్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.
