దేశీ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ ఇచ్చేందుకు ఏర్పాట్లు: మోడీ
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతా కరోనా రూల్స్ పాటించాలి
గుజరాత్లోని రాజ్కోట్లో ఎయిమ్స్కు శంకుస్థాపన
అహ్మదాబాద్: ‘‘దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. అయినప్పటికీ ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా రూల్స్ను పాటించాలి” అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. గురువారం గుజరాత్లోని రాజ్కోట్లో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్కు ఇండియా సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘మందు వచ్చే దాకా నిర్లక్ష్యం వద్దని ఇప్పటిదాకా చెప్పాను. కానీ 2021లో మన మంత్రం.. ‘మెడిసిన్ కూడా, జాగ్రత్త కూడా’ కావాలి” అని మోడీ సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
వారి త్యాగాలు గొప్పవి
కరోనా టైంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, సైంటిస్టులు, స్వచ్ఛంద సంస్థలు సమాజానికి చేసిన త్యాగాలు, సేవలు ఎంతో గొప్పవని మోడీ పొగిడారు. ‘‘దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ను అభివృద్ధి చేసేందుకు పని చేస్తున్నాం. నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు తర్వాత క్వాలిటీ, క్వాంటిటీతో కూడిన హెల్త్ ఎడ్యుకేషన్ను మెరుగుపరుస్తాం” అని వివరించారు. ప్రపంచ ఆరోగ్యానికి నాడీ కేంద్రంగా ఇండియా అవతరిస్తుందని అన్నారు.
రూ.30 వేల కోట్లు సేవ్ చేశాం
ఆయుష్మాన్ భారత్ ద్వారా 30 వేల కోట్లు ఆదా చేశామని మోడీ చెప్పారు. ఈ పథకం కింద 1.5 కోట్ల మంది పేదలు రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో 1.5 లక్షల హెల్త్, వెల్నెస్ సెంటర్లు నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని తెలిపారు. వీటిలో 50 వేల సెంటర్లు ఇప్పటికే స్టార్ట్ చేశామని, ఇందులో 5 వేల వరకు గుజరాత్లో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా గత ఆరేళ్లలో 10 కొత్త ఎయిమ్స్ పనులు మొదలయ్యాయని, 20 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. ‘ఆరోగ్య పరిష్కారాల సంవత్సరం’గా 2021 అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘దేశవ్యాప్తంగా ఉన్న 7 వేల జన్ ఔషధి కేంద్రాలు.. 90 శాతం చౌక ధరలకు మందులు అందజేస్తున్నాయి. రోజూ 3.5 లక్షల మంది పేదలు ఈ కేంద్రాల్లో మందులు కొంటున్నారు” అని
వెల్లడించారు.
కొత్త ఆశలతో 2021..
వ్యాక్సిన్ విషయంలో వచ్చే పుకార్లు, ఆధారాలు లేని వాదనలను ప్రజలు నమ్మొద్దని ప్రధాని సూచించారు. ఇప్పటికే చాలా మంది అబద్ధాలు వ్యాప్తి చేయడం స్టార్ట్ చేశారని విమర్శించారు. ‘‘కరోనా వైరస్ వల్ల 2020లో జనంలో అసంతృప్తి, నిరాశా వాతావరణం నెలకొంది. అన్ని చోట్ల సందేహాలే. కానీ ట్రీట్మెంట్ పరంగా కొత్త ఆశాకిరణాలతో 2021 వచ్చింది” అని ఆయన చెప్పారు. కొత్త కరోనా కేసులు, డెత్ ల విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా ఎంతో మెరుగైన స్థితిలో ఉందని అన్నారు. సకాలంలో, సమర్థమైన చర్చలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ‘‘దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికీ మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం” అని వివరించారు.
For More News..
న్యూ ఇయర్కు వ్యాక్సిన్తో వెల్కమ్!
ఓటుకు నోటు కేసులో చంద్రబాబే డీల్ చేసిండు
మార్చి నుంచి కరోనాతో ఆగమాగం
సాగు సాగుతలేదు.. నెమ్మదించిన వరి నాట్లు
