
అనగనగా ఒక రాజు.. ఆయనకో ఓ పే...ద్ద రాజ్యం. ఆ పే...ద్ద రాజ్యం మీదకి.. ఇంకో పే...ద్ద రాజ్యపు రాజు దండెత్తుతున్నడు. ఈ విషయం ఒక ‘గూఢచారి’ వచ్చి చెప్పిండు. ఆ గూఢచారి చెప్పిన సందేశంతో రాజు అప్రమత్తమై.. శత్రు రాజ్యపు రాజును ఓడించిండు.. రాజ్యాన్ని కాపాడుకుండు!
పోటెత్తుతున్న సంద్రం మధ్యలో వందలాది మందితో ఓ పెద్ద నౌక ఆగిపోయింది. చచ్చిపోతరు అనుకున్న టైంలో వచ్చి ఆపతిలో ఉన్నోళ్లకు సాయం చేసే సోపతిగాళ్లను తెచ్చింది.. యుద్ధభూమిలో బాడీగార్డుల్లా శత్రుమూకల నుంచి సైనికులను కాపాడింది. ఇదంతా రెండు పిడికిళ్లలో పట్టే ఓ చిన్న పావురం గురించి.
ఇది ఒకవైపే.. దాని రెండోవైపు మాత్రం చాలా భయంకరమైన విషయం ఉంది. సూడసక్కంగ..అమాయకంగా ఉండే ఆ ముద్దుముద్దు పావురాలే.. మన ప్రాణాల్ని తోడేస్తయి. సందేశాల్ని మోసుకొచ్చే ఆ క్యారియర్లే.. ప్రాణాలను తీసే బ్యాక్టీరియాలనూ మోసుకొస్తున్నయ్. దాని రెక్కల నుంచి రెట్టల దాకా అంత విషమే.. మనిషి ఉన్న దగ్గర పావురం లేచి ఎగిరిందా మన ఒంట్లోకి బ్యాక్టీరియా పోయినట్టే. అది రెట్ట వేసిందా.. అక్కడ బ్యాక్టీరియా పాకినట్టే.
అట్లాంటి పక్షులకే ఇప్పుడు మనం రోడ్డు పక్కన గింజలేసి పెంచేస్తున్నం.. ప్యాంపర్ చేస్తున్నం. ఎక్కడ పడితే అక్కడ అవి బ్యాక్టీరియాలను, ప్రాణాలను తీసే శ్వాసకోశ జబ్బులను వ్యాపింపజేస్తున్నాయి. లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే పరిస్థితులకు కారణమవుతున్నయి. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీ కూడా అందుకు అతీతమేమీ కాదు.
ఇది చదివిన తరువాత పావురాలు ఇంత డేంజరా? అనిపిస్తుంది కదా!. అసలు ఈ పావురాలు వ్యాపింపజేస్తున్న సీరియస్ జబ్బులేంటి? పావురాలు పెంపుడు పక్షులుగా ఎప్పుడు మారాయి? వంటి అటెంటివ్, ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ వారం కవర్ స్టోరీ.
సిటీలో 8 లక్షల పావురాలు
హైదరాబాద్ నగరంలో పావురాల ప్రేమికులు రోజురోజుకి పెరుగుతున్నారు. వివిధ ప్రాంతాల్లో పావురాలకి దాణా వేస్తుండడం వల్ల వాటి సంఖ్య విపరీతంగా పెరిగి నగరవాసుల ఆరోగ్యానికి హానికరంగా మారాయి. సిటీ మొత్తంలో దాదాపు 250 ఫీడింగ్ సెంటర్లు ఉన్నాయి. దీని వల్ల ఏటేటా సిటీలో పావురాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాటి సంఖ్యతో పాటు శ్వాసకోశ జబ్బులూ ఎక్కువైపోతున్నాయి. ఊపిరితిత్తుల సమస్యలతో చాలామంది ఆస్పత్రులకు ‘క్యూ’ కడుతున్నారు. హైదరాబాద్ సిటీలో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా పావురాలు ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ట్యాంక్బండ్, నాంపల్లి, పురానాపూల్, చార్మినార్, అఫ్జల్గంజ్, చాంద్రాయణ్గుట్ట, ఫలక్నుమా, మొజాంజాహీ మార్కెట్, సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో పావురాల సంఖ్య విపరీతంగా ఉంది. పావురాల సంఖ్య, వాటి సంతానోత్పత్తిని తగ్గించాల్సిందిగా జీహెచ్ఎంసీకి ఇటీవల ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అయితే, కోఠిలోని హస్మత్గంజ్ దగ్గర తప్ప మరెక్కడా కూడాపావురాలకు సంబంధించిన బోర్డ్స్పెట్టలేదు జీహెచ్ఎంసి. అలాగే వాటి సంతానోత్పత్తిని తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోలేదు. దీంతో ఏడాదికేడాది పావురాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. సాధారణంగా వీటి జీవిత కాలం 12–15 సంవత్సరాలు. ఒక ఏడాదిలో పావురాల జంట దాదాపు16 పిల్లలను పెడతాయి.
రెట్టలతో చారిత్రక కట్టడాలు కరాబ్
వాస్తవానికి పావురాలకు గూడు అంటూ ఏమీ ఉండదు. రాజుల కాలంనాటి కట్టడాలు అయిన పురాతన భవనాలు, మొజంజాహి మార్కెట్, సిటీ కాలేజీ, మక్కా మసీద్, ఫలక్నుమా ప్యాలెస్, ఉస్మానియా ఆస్పత్రి వంటి చారిత్రక కట్టడాలు, మెట్రో స్టేషన్లు, పెద్ద పెద్ద బిల్డింగుల కిటికీల్లో ఈ పావురాలు స్ధిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి. ఆ ప్రాంతాల్లో రెట్టలు వేస్తున్నాయి. ఫలితంగా ఆ చారిత్రక కట్టడాలు కరాబ్ అయిపోతున్నాయి. ఇళ్లు, ఫ్లాట్స్ బయట ఉండే ఏసీ యూనిట్ల దగ్గర కూడా అవి నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి.
ప్రాణాంతక జబ్బులకు రిజర్వాయర్
ప్రాణాంతక వైరస్లకు రిజర్వాయర్లు అనగానే గుర్తొచ్చేది గబ్బిలం. కొన్ని వేల రకాల వైరస్లు గబ్బిలం లాలాజలం, రెట్ట, పొట్టలో ఉంటాయి. అలాగే ప్రాణాంతక బ్యాక్టీరియాల క్యారియర్లు పావురాలు. రెక్కల నుంచి రెట్టల దాకా అన్నింట్లోనూ బ్యాక్టీరియా, ఫంగస్లే ఉంటాయి. పావురాల రెట్టలు, రెక్కల్లోని బ్యాక్టీరియా, ఫంగైల వల్ల 60కిపైగా ప్రాణాంతక జబ్బులు వస్తాయని ఓ రీసెర్చ్ వెల్లడి చేసింది. అందులో అత్యంత ప్రమాదకరమైనవి హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్, క్యాండిడయాసిస్, సిట్టకోసిస్, ఏవియన్ ట్యుబర్క్యులోసిస్, బర్డ్ ఫ్లూ. రెట్టలు వేసినప్పుడు దాని నుంచి విడుదలయ్యే గ్యాస్ను పీల్చుకుంటే కాలేయం, స్ప్లీన్(ప్లీహం) దెబ్బతింటాయి. తీవ్రమైన జ్వరం, న్యుమోనియా, రక్తంలో తేడాలు, ఇన్ఫ్లుయెంజా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటు ఏసీల దగ్గర కూడా పావురాలు నివాసం ఏర్పాటు చేసుకుని రెట్టలు వేస్తున్నాయి. ఆ ఏసీల ద్వారా కూడా వాటి ప్రమాదకర రేణువులు ఇంట్లోకి జొర్రి ప్రాణాంతకంగా మారుతున్నాయి.
చికిత్స లేదు.. నివారణే
పావురాల నుంచి వ్యాపించే వ్యాధులకు చికిత్స లేదు. అందుకని వాటిని జనావాసాల్లోకి రాకుండా నివారించడమే ఏకైక చికిత్స అంటున్నారు నిపుణులు. పావురాల్లోని ప్రియాన్ అనే ప్రొటీన్ కారణంగా.. మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన కణాలపై అవి పోగుపడుతాయి. ఈ ప్రొటీన్ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్లను గుర్తించడం కూడా కష్టమే. ఈ ప్రొటీన్తో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి.. మతిమరుపు, పర్సనాలిటీలో మార్పులు, కదల్లేకపోవడం వంటి సమస్యలూ వస్తాయి. చివరకు ప్రాణాలను తీస్తాయి. నిఫా వైరస్ను పావురాలు మోసుకొస్తున్నాయట. ఎబోలా వంటి వైరస్లు వస్తే.. పావురాలతోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుందన్న ఆందోళననూ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రాణాంతక వైరస్లకు అవి వెక్టార్లుగా మారిపోతున్నాయి అంటున్నారు. కాబట్టి ముందుగా ఎంత జాగ్రత్త తీసుకుంటే అంతమంచిది అని అభిప్రాయపడుతున్నారు ఆరోగ్యనిపుణులు.
బర్డ్ ఫ్యాన్సియర్ లంగ్స్
బర్డ్ ఫ్యాన్సియర్ లంగ్స్– దీని గురించి ఎప్పుడైనా విన్నారా! అంటే ఇష్టం కొద్దీ చాలా మంది పావురాలను ఇంట్లోనే పెంచుతుంటారు. అలాంటి వాళ్లు ఈ డిజార్డర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పావురాల రెట్టల్లోని యాంటీజెన్లను పీల్చినప్పుడు పావురం పెంపకందారుల ఊపిరితిత్తులు ‘హైపర్సెన్సిటివిటీ న్యూమోనైటిస్’ అనే ఇన్ఫెక్షన్కు గురవుతాయి. దాన్నే బర్డ్ ఫ్యాన్సియర్ లంగ్ డిజార్డర్ అంటారు. ఇందులో ప్రధానంగా ఊపిరి తీసుకోలేకపోవడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరైతే విపరీతంగా బరువు తగ్గిపోతారు. తిండి తినకుండా నోటిని కట్టేసుకుంటుంటారు. దీర్ఘకాలంలో పావురాల రెట్టలతో ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తుల పనితీరు తగ్గిపోతూ వస్తుంది. అది కాస్తా పల్మొనరీ ఫైబ్రోసిస్కు దారి తీసి శ్వాసవ్యవస్థ ఫెయిల్ అయిపోతుంది. ప్రాణాలను తీసేస్తుంది.
తొలి డెత్ ముంబయిలో.. హైదరాబాద్లో ఇద్దరు?
పావురాలు మనుషుల ప్రాణాలను తోడేస్తున్నాయనేందుకు ముంబయిలో జరిగిన ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జయశ్రీ అనే 53 ఏండ్ల మహిళ పావురాలు వేసిన రెట్టల వల్లే చనిపోయింది. ఈ ఘటన జరిగి దాదాపు ఆరేండ్లయింది. పావురాల వల్ల చనిపోయిన తొలి కేసు ఇదే. చనిపోయిన ఆ మహిళ ముంబైలోని బొరివలీ ఈస్ట్లో ఉండేది. ఆమె ఇంటి పక్కనే కబూతర్ఖానా ఉండేది. అనారోగ్యం బారిన పడిన ఆమెను పరీక్షించిన డాక్టర్ ‘‘ఏండ్ల తరబడి పావురాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే ఆమె ఉండే చోటు మార్చమ’’ని తేల్చి చెప్పారు. ఆ డాక్టర్ ఆ విషయం చెప్పిన తర్వాత కొద్ది రోజులకే ఆమె మరణించింది. ఆ ప్రాంతంలోని వందలాది మందికి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చాయి. హైదరాబాద్లో కూడా ఇద్దరు మరణించారని కొన్ని కథనాలు చెప్తున్నా.. వాటిని ధృవీకరించేందుకు ఆధారాలు మాత్రం లేవు.
లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్
పావురాల వల్ల కొందరు చావు అంచుల దాకా వెళ్లొచ్చిన వాళ్లూ ఉన్నారు. కొందరైతే ఊపిరితిత్తుల మార్పిడి చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. ముంబయి, అహ్మదాబాద్లో ఈ రేర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ముంబైలో 2020 జనవరిలో బ్రీచ్ క్యాండీకి చెందిన 38 ఏండ్ల మహిళ, బొరివలీకి చెందిన 68 ఏండ్ల మహిళ, నిరుడు అక్టోబర్లో ముంబయికే చెందిన 64 ఏండ్ల మహిళ, ఈ ఏడాది ఏప్రిల్లో అహ్మదాబాద్కు చెందిన 40 ఏండ్ల మహిళకు ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ చేశారు. ఇవి బయటపడిన కొన్ని ఘటనలే. బయటకు రాని ఇలాంటి కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
హైదరాబాద్ కబూతర్ ఖానా క్లోజ్డ్
హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో కబూతర్ ఖానా చాలా ఫేమస్. కానీ, ఆ చుట్టుపక్కల వాళ్లు దాని వల్ల తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారు. అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికుల ఫిర్యాదుతో ఈ ఏడాది మార్చిలో ఆ కబూతర్ ఖానాను అధికారులు మూసేశారు. 1941లో ఏర్పాటుచేసిన చారిత్రక కబూతర్ ఖానాకు మొత్తంగా తాళాలు వేశారు. కబూతర్ ఖానాకు రోజూ వందల సంఖ్యలో జనాలొచ్చి పావురాలకి మేత వేసేటోళ్లు. ఐదారు షాపుల్లో అయితే వాటికి వేసే గింజలను మాత్రమే అమ్మేవారు. రోజుకు దాదాపు 200 కిలోల నుంచి 400 కిలోల దాకా జొన్న లు అక్కడ అమ్ముడయ్యేవి. అమావాస్య వస్తే అక్కడికొచ్చి పావురాలకు దాణా వేసేటోళ్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదట.
పావురాలకు దూరంగా ఉండాలె..
‘‘ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే పావురాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే మనుషులు నివసించే ప్రాంతాల్లో వాటికి ఫీడింగ్ చేయొద్దు. ఒకవేళ పావురాలు ఇంటి కిటికీల్లో, ఏసీల్లో రెట్టలేసి పాడు చేస్తే.. అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ క్లీన్ చేయాలి. చేతికి గ్లౌవ్స్ వేసుకోవాలి. ముఖానికి మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. పావురాలు ఇండ్లలోకి రాకుండా మెష్ ఏర్పాటు చేసుకోవాలి” అని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. పావురాల సంఖ్య ఎక్కువైనట్టు అనిపిస్తే వెంటనే మునిసిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
పావురం చెయిన్తో.. పెండ్లి అయితదట!
పావురాన్ని హిందూ పురాణాల్లో పవిత్రమైన పక్షులుగా చెప్తారు. ప్రేమ దేవుడిగా పిలుచుకునే మన్మథుడి భార్య రతీ దేవికి పావురం వాహనంలా ఉండేదని పురాణాలు చెప్తున్నాయి. హిందూ విశ్వాసాలను నమ్మేవాళ్లూ దాన్నే విశ్వసిస్తుంటారు. వయసు మీద పడి, పెండ్లీడు దాటిపోయినా పెండ్లి కానోళ్లు కోకొల్లలు. అట్లాంటోళ్లు పావురం పెండెంట్ ఉన్న నెక్లెస్ను వేసుకుంటే వాళ్ల పెండ్లి తొందరగా అవుతుందనే విశ్వాసం ఉంది చాలామందిలో. అయితే ఆ విశ్వాసం... విశ్వాసం దగ్గరే ఆగిపోలేదు. ప్రాక్టికల్గా ఆ నెక్లెస్ను వేసుకునేటోళ్లు ఎంతో మంది. అంతేకాదు.. జీవితంలో సుఖ సంతోషాలతో ఉండేందుకు కూడా అది ఉపయోగపడుతుంది అని నమ్మేవాళ్లూ ఉన్నారు!
తొలి పిజియన్ సర్వీసెస్ మన దేశంలోనే
ఒకప్పుడు ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి మెసేజ్లు చేరవేసేందుకు పావురాలను వాడారన్న సంగతి తెలిసిందే. మరయితే ఇప్పటికీ వాటిని అలా వాడుతున్నారా? అంటే.. ఒడిశాకు పోతే ‘అవున’నే చెప్తారు. అక్కడి పోలీసోళ్లు ఇప్పటికీ పావురాలను మెసేజ్ కారియర్లుగా వాడుతున్నారు. వాటిని మెసేజ్ కారియర్లుగా వాడుతున్న ఒకే ఒక్క రాష్ట్రం ఒడిశానే! క్యారియర్ పిజియన్ సర్వీస్ పేరిట1946లో ప్రారంభమైన ఆ సేవలు ఇప్పటికీ కొనసాగుతుండడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించకమానదు. ప్రస్తుతం వాళ్ల దగ్గర ఉన్న రెండు పిజియన్ క్యారియర్ సెంటర్లలో మొత్తం149 పావురాలున్నాయి. సెంట్రల్ బ్రీడింగ్ లాఫ్ట్ పేరుతో కటక్లో, పీటీసీ పేరిట అంగుల్లో రెండు సెంటర్లను నిర్వహిస్తున్నారు. అయితే వాటిని కేవలం శాంతి సందేశం కోసమే వాడుతున్నారు. ఇప్పటిదాకా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో 26 సార్లు వాటి ద్వారా శాంతి సందేశం పంపించారు.ఒడిశా పోలీసులు పావురాలని మూడు కేటగిరీలుగా వాడుకుంటున్నారు.
- స్టాటిక్: వీటిని వన్వే కారియర్లు అనొచ్చు. వరదలు, తుపాన్ల సమయంలో అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వీటిని వాడతారు.
- బూమరాంగ్: పేరులోనే ఉంది కదా.. ఏ ప్లేస్కు పంపించినా తిరిగి పంపిన దగ్గరకే వచ్చే సర్వీసు కోసం వీటికి ట్రైనింగ్ ఇస్తారు. దూరంగా ఉండే పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపించేందుకు వీటిని వాడుతున్నారు.
సైకిల్, బైక్, కార్, హార్స్ రేస్ల గురించి వినే ఉంటారు. కోడిపందేల గురించి తెలిసే ఉంటుంది. మరి పావురాల రేసింగ్ గురించి విన్నారా! ఇప్పుడు అదే హాట్ ట్రెండ్. మన దేశంలో పావురాల రేసింగ్కి మస్త్ క్రేజ్ ఉంది. చెన్నయ్, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ వంటి సిటీల్లో పావురాల రేసింగ్ నిర్వహిస్తుంటారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్, పుణెలకూ ఆ ట్రెండ్ విస్తరించింది. ఒక్క చెన్నయ్లోనే అత్యధికంగా పావురాలను రేసింగ్కు పంపించే వాళ్లు 5000 మంది దాకా ఉన్నారు. వీళ్లను ‘ఫ్యాన్సియర్స్’ అని పిలుస్తుంటారు. అయితే, అందులో కేవలం వెయ్యిమంది మాత్రమే రేస్లలో పాల్గొంటున్నారట. మన హైదరాబాద్లో వంద మంది దాకా ఫ్యాన్సియర్స్ ఉన్నారట. అంతేకాదు.. పావురాల రేసింగ్ అసోసియేషన్లు కూడా పుట్టుకొచ్చాయి. చెన్నయ్ని పావురాల రేసింగ్ రాజధానిగా పిలుస్తారు.
నిరుడు ఏప్రిల్లో ‘ఢిల్లీ టు బెంగళూరు’ పావురాల రేసింగ్ నిర్వహించారు. ఈ పోటీల్లో రెడ్ రాకెట్ అనే పావురం గెలిచింది. ఆ పావురం దాదాపు 1,741 కిలోమీటర్లను నిమిషానికి 250 మీటర్ల వేగంతో ట్రావెల్ చేసిందట. రేసులో ఏ పావురం గెలిచిందన్న విషయాన్ని ఎలా నిర్ధారిస్తారు అని ఆలోచిస్తున్నారా! రేసులో పాల్గొనే పావురాల కాళ్లకు ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ) ట్యాగ్స్ పెడతారు. అది... ఆ పావురం ఎంత దూరం? ఎంత వేగంతో ప్రయాణించింది అన్న విషయాలను రికార్డ్ చేస్తుంది. ఏదైతే ఎక్కువ వేగంతో ఎక్కువ దూరం ప్రయాణిస్తుందో ఆ పావురాన్నే విజేతగా ప్రకటిస్తారు.
వాస్తవానికి మన దేశంలో ఈ పావురాల రేసింగ్ ట్రెండ్ 1940లోనే ప్రారంభమైంది. ఇప్పుడంటే రేసింగ్ పిజియన్ క్యాపిటల్గా చెన్నయ్ పాపులర్ అయింది. కానీ.. అప్పట్లో రేసింగ్కు కలకత్తా పెట్టింది పేరు. తొలిసారిగా కలకత్తాలో 1953లో రేసింగ్ పిజియన్ క్లబ్ను ఏర్పాటు చేశారు. దేశంలో మరిన్ని రేసింగ్ పిజియన్ క్లబ్బులు పుట్టుకురావడానికి అది దోహదం చేసింది. ఆ క్లబ్ వ్యవస్థాపకుడు పీఎస్ లీ, సెక్రటరీ వైఎస్ చిన్లు నేటి ఆధునిక పావురాల రేసింగ్కు ఆద్యులని చెప్తుంటారు. ఆ తర్వాత 1970ల్లో మద్రాస్కు పావురాల రేసింగ్ ట్రెండ్ విస్తరించింది. అక్కడ మద్రాస్ హోమింగ్ పిజియన్ అసోసియేషన్, నార్త్ మద్రాస్ హోమింగ్ పిజియన్ అసోసియేషన్లు ఏర్పాటయ్యాయి. కర్ణాటకలోనూ ‘కర్ణాటక హోమింగ్ పిజియన్ ఫెడరేషన్’ పేరుతో అసోసియేషన్ ఉంది. అయితే, ప్రపంచంలో తొలిసారిగా పిజియన్ రేసింగ్ను నిర్వహించింది మాత్రం బెల్జియంలో. 1818లో తొలి రేసింగ్ను అక్కడ పెట్టారు. ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లోనూ పావురాల రేసింగ్ నిర్వహిస్తున్నారు. మరో విశేషమేంటంటే.. పావురాల రేసింగ్కు ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ కూడా ఉండడం. ఫెడరేషన్ కొలంబోఫైల్ ఇంటర్నేషనల్ పేరిట బ్రస్సెల్స్లో హెడ్క్వార్టర్స్ను ఏర్పాటు చేశారు.
పాలు ఇస్తయ్..
పక్షులు పాలు ఇస్తయా! ఇవ్వవు అనే అంటరు కదా. కానీ, పావురాలు పాలు ఇస్తాయి. అయితే, అది కొన్నాళ్లే... పుట్టిన పావురం పిల్లల బొజ్జ నింపేందుకు పాలను ఉత్పత్తి చేస్తాయట. దానినే క్రాప్ మిల్క్ అని పిలుస్తారు. ఫుడ్ను కడుపులోకి తీసుకెళ్లే ఈసోఫేగస్ అనే పేగు దగ్గర ఉండే భాగాన్ని క్రాప్ అంటరు. ఆ క్రాప్లోనే పావురాలు పాలను ఉత్పత్తి చేస్తాయి. క్షీరదాల్లాగానే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పాలను ఉత్పత్తి చేస్తుందట వీటిలో. ఇంకో విశేషమేంటంటే ఆడ, మగ రెండూ పాలను ఇస్తాయి. ఫ్లెమింగో, పెంగ్విన్లు కూడా ఈ జాబితాలో ఉంటాయి.
నావిగేషన్లో ఎక్స్పర్ట్స్
మనం ఇప్పుడు ఎక్కడికెళ్లినా మ్యాప్స్ ఓపెన్ చేసుకుని జర్నీ మొదలుపెడుతున్నం. కానీ, పావురాలే మంచి మ్యాప్స్. నావిగేషన్లో అవి ఎక్స్పర్ట్. 2000 కిలోమీటర్ల అవతల వదిలేసి వచ్చినా.. మళ్లీ తన గూడుకు చేరిపోతుంది. వెళ్లిన దారిని కన్ఫ్యూజ్ చేసినా.. దారి గుర్తుపెట్టుకుని మరీ తిరిగి వచ్చేస్తాయట. పావురాల్లో స్వతహాగా కంపాస్, మ్యాప్ మెకానిజమ్స్ ఉంటాయి. మ్యాప్ మెకానిజం ఇప్పటికీ మిస్టరీనే అయినా.. దానిలోని కంపాస్ సామర్థ్యాలను మాత్రం సైంటిస్టులు డీకోడ్ చేశారు. భూమిలోని అయస్కాంత తరంగాలు, సూర్యుడి పొజిషన్ ఆధారంగా అవి ముందుకు సాగిపోతుంటాయట.
యుద్ధ వీరులు
పావురాలు యుద్ధ వీరులు.. అంటే నమ్మి తీరాల్సిందే. శత్రు దేశాల వ్యూహాలు తెలుసుకునేందుకు.. గూఢచర్యం చేసేందుకు, ఆపదలో చిక్కుకున్న సైనికులకు సందేశం పంపి కాపాడేందుకు పావురాలనే వాడేటోళ్లు అప్పట్లో. ప్రపంచ యుద్ధాల్లో అవి అమూల్యమైన సేవలనూ అందించాయి. యుద్ధంలో అమూల్యమైన సేవలు అందించిన జంతువులకు ఇచ్చే డిక్కిన్ మెడల్ను 32 పావురాలకు అందించారు. జీఐ జో, ప్యాడీ, చెర్ అమీ వంటి పావురాలు కొన్ని వందల మంది సైనికులను కాపాడాయి. ఐదు నిమిషాల్లో బాంబు దాడి జరుగుతుందనగా.. ఆ సమాచారాన్ని చేరవేసి జీఐ జో కొన్ని వందల మంది బ్రిటిష్ సైనికులను కాపాడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 12 అత్యంత ముఖ్యమైన సందేశాలను అమెరికా ట్రూప్స్కు చెర్ అమీ చేరవేసింది. అయితే, తన చివరి మిషన్లో భాగంగా ప్రయాణిస్తున్న చెర్ అమీని శత్రు సైన్యం కాల్చేసింది. దాని ఛాతిలో బుల్లెట్ ఉన్నా.. 25 నిమిషాలు ప్రయాణించి చిక్కుకుపోయిన 194 మంది సైనికుల ప్రాణాలను నిలబెట్టింది.
ఫీడింగ్ ఆపడం ఒక్కటే మార్గం
పావురాల సంతతిని అరికట్టడానికి ఫీడింగ్ ఆపేయడం, ఇండ్లు, ఆఫీసుల్లో అవి గూడు కట్టుకోకుండా చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గం. ఇది జరగాలంటే ఫీడింగ్ వేసే వారిపై ఫైన్లు విధించాలి. పావురాల వల్ల కలుగుతున్న అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. పావురాల సమస్య ఉన్న దేశాల్లో ఇదే పద్ధతిని అవలంబిస్తారు. పావురాలు అటవీశాఖ పరిధిలోకి రానందున, ఈ విషయాలన్నీ తెలియజేస్తూ జీహెచ్ఎంసీకి రెండుసార్లు లేఖ రాశాం. కానీ, వారి నుంచి రెస్పాన్స్ రాలేదు. పావురాలను పట్టుకుని వేరే ప్రాంతాలకు తరలించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కొంతమంది మా దగ్గరకు వస్తున్నారు. కానీ, అలా పర్మిషన్ ఇచ్చే అధికారం మాకు లేదు. పావురాలను అడవుల్లో వదిలేయడానికి కూడా మేము ఒప్పుకోం. వాటి వల్ల ఇతర పక్షులు, జంతువులకు రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది. మనుషులకు కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పావురాల సంతతిని నియంత్రించాల్సిన అవసరముంది. పంచాయతీరాజ్, మునిసిపల్ డిపార్ట్మెంట్లు ముందుకొస్తే వారికి మేము కూడా సహకరిస్తాం.
శంకరన్, ఓఎస్డీ, వన్యప్రాణుల విభాగం, అటవీశాఖ.
ఆక్సిజన్ ఉత్పత్తిని తగ్గిస్తయ్
పావురాల రెట్టలు, ఈకల్లోని బ్యాక్టీరియా శ్వాసవ్యవస్థలోకి పోయి ఆక్సిజన్ ఉత్పత్తిని డ్యామేజ్ చేస్తాయి. ఆయాసం, ఛాతి నొప్పి, తలనొప్పి వస్తాయి. హైపర్సెన్సిటివ్ న్యూమోనైటిస్ వచ్చిందంటే స్టెరాయిడ్స్ ఇస్తారు. కొన్నిసార్లు ఆక్సిజన్ కూడా అవసరం అవుతుంది. కొందరికి ఉపిరితిత్తులు బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు లంగ్స్మార్పిడి చేయాల్సి వస్తది. టీబీ, షుగర్, బీపీ, కిడ్నీ జబ్బు, క్యాన్సర్ పేషెంట్లకు ముప్పు ఎక్కువ ఉంటుంది. వీటి టెస్ట్లు, ట్రీట్మెంట్ కూడా బాగా ఖర్చుతో కూడుకున్నది. పావురాలు ఉన్న పరిసర ప్రాంతాలలో నివసించే జనాలు ముందు జాగ్రత్త వహించడం మంచిది.
- డా . మహబూబ్ ఖాన్, సూపరింటెండెంట్, చెస్ట్ హాస్పిటల్, ఎర్రగడ్డ
భూమ్మీదకు వచ్చిందప్పుడే...
పావురాలు తొలిసారి భూమ్మీద ఎప్పుడు పుట్టాయన్నదానికి సరైన ఆధారాలైతే లేవు. కానీ.. సైంటిస్టులు చేసిన పరిశోధనల ఆధారంగా 2.3 కోట్ల ఏండ్ల క్రితం భూమిపై వాటి ఆనవాళ్లున్నట్టు మాత్రం తేలింది. కొలంబిఫార్మ్స్ అని పిలిచేవారట వాటిని. ఆ జాతికి చెందిన తొలి పావురమే ‘జెరాండియా కల్కారియా’ అని చెప్తారు. ఫ్రాన్స్లోని మయోసీన్లో తొలి పావురం ఆనవాళ్లు లభించాయని చెప్తారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని దీవుల్లోనూ రెండు జాతుల పావురాలున్నాయని ఆధారాలు లభ్యమయ్యాయి. వీటిని డోడో, సాలిటైర్స్ అని అంటారు. అయితే, తొలిసారి వాటిని పెంచుకోవడం మొదలుపెట్టింది మాత్రం10 వేల ఏండ్ల కిందటేనని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. క్రీస్తు పూర్వం 4500వ సంవత్సరంలో వీటిని పెంచుకోవడం ప్రారంభించారని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాదు.. మనుషులు మచ్చిక చేసుకున్న తొలి పక్షి కూడా పావురమేనట. మచ్చిక చేసుకున్న ఆ పక్షులనే ఆహారంగా తినేవారట.
కేన్సర్ను ఇట్టే పట్టేస్తయ్!
కేన్సర్.. సైలెంట్ మహమ్మారి. దీనిని గుర్తించడమూ కష్టమే. అయితే, పావురాలు కేన్సర్ కణాలను చాలా ఈజీగా పట్టేస్తాయన్న సంగతి తెలుసా! నిపుణులు ఎంత పర్ఫెక్ట్గా గుర్తిస్తారో.. అంతే కచ్చితత్వంతో పావురాలు కూడా కేన్సర్ కారక కణాలను గుర్తిస్తాయట. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ అయోవాలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్
మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. 1948 ఏప్రిల్ 13న ఒడిశాలోని సంబల్పూర్పర్యటనకు వెళ్లారు. అదే రోజు కటక్లో ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దానికి సంబంధించి ఓ ఇంపార్టెంట్ మెసేజ్ను కటక్ పోలీసులకు ఆయన పంపించాలనుకున్నారు. పోలీసులు తెచ్చిన మెసెంజర్ను చూసి ఆయన షాక్ అయ్యారు. తన మెసేజ్ అక్కడికి చేరుతుందా? అని సంకోచించారు. పోలీసులు ఒప్పించడంతో.. పావురం ద్వారా మెసేజ్ పంపించారు. సంబల్పూర్ నుంచి 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్కు ఉదయం 6 గంటలకు జర్నీని షురూ చేసిన పావురం.. సరిగ్గా ఐదున్నర గంటల్లో అంటే ఉదయం 11.25 గంటలకు కటక్కు చేరుకుంది. ఆ తర్వాత కటక్ చేరుకున్న నెహ్రూ.. అదే పావురాన్ని, తాను పంపిన సందేశాన్ని చూసి షాక్ అయిపోయారు. తన మెసేజ్ అంత స్పీడ్గా చేరినందుకు సంబురపడిపోయారు. ఇప్పుడంటే ఫోన్లు, టెక్నాలజీ, అధునాతన ఇంటర్కామ్స్ ఉన్నాయి. మరి అప్పుడు ఏమీ లేవు కదా. అలాంటి టైంలోనూ అంత వేగంగా ఆ పావురం సందేశాన్ని తీసుకెళ్లడం గొప్పే కదా. మరి, పావురంతో నెహ్రూ పంపిన ఆ సందేశమేంటో తెలుసా! ‘‘నేను సభలో మాట్లాడేటప్పుడు ప్రజలకు ఎక్కువ దూరం ఉండకుండా ఏర్పాట్లు చేయండి’’ అని.
ఒకప్పుడు పది లక్షలు
పావురాల సంతానోత్పత్తి తగ్గిస్తున్నం. ఒకప్పుడు 10 లక్షల వరకు ఉండేవి. ప్రజలకు వీటి వలన కలిగే రోగాల గురించి అవగాహన కల్పిస్తాం. ముందు ముందు ఇంకా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పావురాలు ఉన్న చోట దాణా వేయొద్దని బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తాం.
- అబ్దుల్ వకీల్, జీహెచ్ఎంసీ చీఫ్వెటర్నరీ ఆఫీసర్
ప్రియాన్ ప్రొటీన్ చాలా డేంజర్
పావురాల రెక్కల్లో ప్రియాన్ అనే ప్రొటీన్ ఉంటుంది. దానిని పీల్చుకుంటే చాలా ప్రమాదం. హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ వస్తుంది. అది చాలా ప్రమాదకరం. దానికి చికిత్స లేదు. రెండు మూడు డ్రగ్స్ ఉన్నా.. ఫలితం తక్కువే. నేను సిటీలో ఉన్నప్పుడు ఆ జబ్బు బారిన పడిన కొన్ని కేసులు వచ్చినయ్. ఇద్దరు చనిపోయారు. ఒకరు 56, ఇంకొకళ్లు 60 ఏండ్ల వాళ్లు. నిఫా వైరస్కు కారియర్గా పావురాలు ఉంటున్నాయి. పావురాలే కేరళలో ఆ వైరస్ను స్ప్రెడ్ చేశాయి. ఇదేకాదు ఇంకా ప్రమాదకరమైన వైరస్ల వ్యాప్తికి పావురాలు కారణం అవుతున్నాయి.
- డాక్టర్ నరేశ్, పల్మొనాలజిస్ట్, కాకతీయ మెడికల్ కాలేజ్
రెండేండ్లలో ముగ్గురు చనిపోయారు
పావురాల రెట్టల వల్ల రెండేండ్లలో ముగ్గురు మరణించారు. గోకుల్చాట్కి వచ్చిన చాలా మంది పావురాలకి ఫీడింగ్ ఇచ్చేవారు. దాదాపు 10 వేల వరకు పావురాలు ఉండేవి. ఇంకా విపరీతంగా పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. మా ఇళ్లలోకి కూడా వస్తున్నాయి. అప్పట్లో వీటి బాధ భరించలేక 10 వేలు పెట్టి నెట్పెట్టించుకునే వాళ్లం. 5 నెలలకి ముందు మా బస్తీవాసులందరం కలసి ఫారెస్ట్, జీహెచ్ఎంసీ అధికారులకి కంప్లైంట్ చేశాం. దాంతో పావురాలకి ఫీడ్ వేయొద్దని అధికారులు బోర్డ్స్ పెట్టారు. ఒకప్పుడు 10 వేల వరకు ఉన్నవి ఇప్పుడు 20కి తగ్గాయి. ఇలా సిటీ మెత్తంలో వీటిని నియంత్రించాలి. వీటి వలన కలిగే జబ్బుల గురించి జనాలకు అవేర్నెస్ కల్పించాలి. అప్పుడే పావురాలకి ఫీడింగ్ చేయడం ఆపుతారు. అప్పుడు వీటి సంతానోత్పత్తి తగ్గిపోతుంది.
- గోవింద్రాఠీ, హస్మత్గంజ్, కోఠి