యూకే నుంచి వచ్చిన వారిలో 8 మందికి పాజిటివ్.. భయపెడుతున్న కరోనా 2.0

యూకే నుంచి వచ్చిన వారిలో 8 మందికి పాజిటివ్.. భయపెడుతున్న కరోనా 2.0
న్యూఢిల్లీ: యూకేలో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తోంది. మ్యూటెంట్‌‌గా రూపం మార్చుకొని వైరస్ రెచ్చిపోతోంది. సోమవారం ఒక్కరోజే బ్రిటన్‌‌లో 24 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చే ఫ్లయిట్‌‌లపై ఈ నెల 31 వరకు బ్యాన్ విధించింది. తాజా అప్‌‌డేట్ ఏంటంటే.. బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చిన వారిలో 8 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ఐదుగురికి, కోల్‌‌కతాలో ఇద్దరికి, చెన్నైలో ఒకరికి వైరస్ పాజిటివ్‌‌గా తేలింది. అయితే ఇది సాధారణ కరోనా వైరసా లేక కొత్త రకం మ్యూటెంట్ కరోనా వైరసా అనేది తేలాల్సి ఉంది. దీన్ని తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. యూకే నుంచి గత కొద్ది రోజుల్లో భారత్‌‌కు వచ్చిన వారికి కరోనా టెస్టులు చేయాలని ఏవియేషన్ శాఖకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. టెస్టుల్లో పాజిటివ్‌‌గా తేలిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్స్‌‌లో చేర్పించాలని తెలిపింది. పాజిటివ్‌‌లుగా తేలిన వాళ్లు తమ ఇళ్లలోకి వెళ్లి హోం ఐసోలేషన్‌‌లో ఉండటానికి వీల్లేదని లేఖలో స్పష్టం చేసింది. అదే సమయంలో నెగిటివ్‌‌గా తేలిన వారు కూడా కచ్చితంగా ప్రభుత్వ కొవిడ్ సెంటర్లలో వారం పాటు ఐసోలేషన్‌‌లో ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చిన వారికి ఇవ్వాళ ఉదయం ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్‌‌గా వచ్చింది. దీంతో వారిని ఇన్‌‌‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌‌కు పంపారు. అలాగే వీరి శాంపిళ్లను పూణెలోని నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. ఇది కొత్త రకం స్ట్రెయినా లేదా భారత్‌‌లో ఉన్న కరోనా రకమా అని తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.