న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం వచ్చే ఆరు నెలల్లో తన ట్రావెల్ వ్యాపారాల్లో రూ.250 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా తన ప్రొడక్ట్, టెక్నాలజీ టీమ్ను మరింత బలోపేతం చేయనుంది. అంతేకాక ప్రస్తుత ట్రావెల్ మార్కెట్లో వాటాను కూడా పెంచుకుంటుంది. తన ట్రావెల్ వ్యాపారాలకు 1.5 కోట్ల మందికి పైగా కస్టమర్లున్నారని, యాన్యువల్ గ్రాస్ మెర్చండైజ్ వాల్యు రూ.7,100 కోట్లు ఉంటుందని పేటీఎం చెప్పింది. టైర్ 2, 3 నగరాల నుంచి బలమైన వృద్ధి నమోదవుతుందని, తమ కొత్త కస్టమర్లలో 65 శాతానికి పైగా వీరే ఉన్నారని పేటీఎం ట్రావెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ రాజన్ అన్నారు. ట్రావెల్ బుకింగ్ స్పేస్లో తమల్ని అతిపెద్ద కంపెనీగా నిలిపేందుకు ఈ ఇన్వెస్ట్మెంట్ సహకరిస్తుందని పేర్కొన్నారు.

