న్యూఢిల్లీ: కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్ కోసం రూ.100 కోట్లను డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం సేకరించింది. పీఎం కేర్స్ ఫండ్ కోసం రూ.500 కోట్ల వరకు సేకరిస్తామని గతంలో కంపెనీ ప్రకటించింది. పేటీఎం వాలెట్, యూపీఐ, పేటీఎం బ్యాంక్ డెబిట్ కార్డ్ నుంచి చేసిన ఏ కంట్రిబ్యూషన్ లేదాపేమెంట్ కైనా కంపెనీ అదనంగా రూ.10ని ఫండ్ కోసం కేటాయిస్తుందని తెలిపింది. 10 రోజుల్లోనే రూ.100 కోట్లను పీఎం కేర్స్ కోసం సమీకరించామని, ఇది ఇంకా కొనసాగుతోందని శనివారం ఓ ప్రకటనలో పేటీఎం వెల్లడించింది. తమ కంపెనీ ఉద్యోగులు కూడా 15 రోజులు, నెల, రెండు నెలల జీతాన్ని పీఎం కేర్స్కు డొనేట్ చేశారని తెలిపింది. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు దేశ ప్రజలందరూ ముందుకు రావాలని పీటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్ పిలుపునిచ్చారు.
