జనసేన పార్టీ అధికార ప్రతినిథులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు, శనివారం ( అక్టోబర్ 21) పార్టీ అధికార ప్రతినిథులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ టీవీ చర్చల్లో, మీడియా సమావేశాల్లో పాల్గొనే వారికి దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజా పయోగ అంశాలపై బలంగా మాట్లాడాలన్నారు. జనసేన ప్రతినిధుల వల్ల టీవీ చర్చలు ఉన్నత విలువలతో జరిగేలా చర్చను ముందుకు వెళ్ళేలా చూడాలన్నారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదని వెల్లడించారు. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించాలన్నారు.ఎన్నికల్లో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యతని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిధిలో రూల్ ఆఫ్ లాకి అనుగుణంగా మన మాట, మన ప్రవర్తన ఉండాలన్నారు
కులాలు, మతాల గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని సూచించారు. అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని దేవాలయం, చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలని పేర్కొన్నారు. ఒక మతం పట్ల ఉదాసీనంగా, మరో మతం పట్ల నిర్లక్ష్యంగా, ఇంకోక మతాన్ని ఎక్కువగా చూడటం వంటి చర్యలకు పాల్పడే నాయకులను, పార్టీలను గట్టిగానే నిలదీయాలన్నారు. మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా చూసుకోవాలి. చర్చలో పాల్గొనే ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదా తూలనాడినా సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఆ క్షణంలో మనం తగ్గినట్టు కనబడినా ప్రేక్షకులు, సమాజం దృష్టిలో పెరుగుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. గతంలో కొన్ని పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ వివిధ కులాలు, మతాలను ఓటు బ్యాంకుగా మలచుకోవడానికి ఎత్తుగడలు వేసేవని, వాస్తవాలు చెప్పండని తెలిపారు.