న్యూఢిల్లీ: ప్యాసెంజర్ వెహికల్స్(పీవీ) రిటైల్ అమ్మకాలు డిసెంబర్, 2020 లో 23.99 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) సోమవారం ప్రకటించింది. డిసెంబర్, 2019 లో 2,18,775 ప్యాసెంజర్ వెహికల్స్ అమ్ముడవ్వగా, గత నెలలో 2,71,249 వెహికల్స్ సేల్ అయ్యాయని పేర్కొంది. ఫెస్టివ్ సీజన్ నుంచి వస్తున్న పెంటప్ డిమాండ్(ఒక్కసారిగా డిమాండ్ రావడం) కొనసాగుతోందని తెలిపింది. దేశంలోని 1,270 ఆర్టీఓ ఆఫీస్ల నుంచి సేకరించిన రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా ఫాడా ఈ డేటాను విడుదల చేసింది. కిందటేడాది డిసెంబర్లో 14,24,620 టూ వీలర్లు సేల్ అయ్యాయని, ఇవి డిసెంబర్, 2019 లో అమ్ముడయిన 12,73,318 వెహికల్స్ కంటే 11.88 శాతం ఎక్కువని పేర్కొంది. కమర్షియల్ వెహికల్ సేల్స్ 59,497 యూనిట్ల నుంచి 13.52 శాతం పడిపోయి గత నెలలో 51,454 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రీ వీలర్స్ సేల్స్ అయితే డిసెంబర్లో 52.75 శాతం పడిపోయాయి. 2019, డిసెంబర్లో 58,651 వెహికల్స్ అమ్ముడుకాగా, గత నెలలో 27,715 యూనిట్లకు ఈ సేల్స్ పడిపోయాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 35.49 శాతం పెరిగి 51,004 యూనిట్ల నుంచి 69,105 యూనిట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి సారిగా డిసెంబర్లో వెహికల్ రిజిస్ట్రేషన్లు పెరిగాయని ఫాడా ప్రెసిడెంట్ వింకేష్ గులాటి చెప్పారు. పంటల దిగుబడి బాగుండడంతో పాటు, టూ వీలర్ సెగ్మెంట్ కొత్త ఆఫర్లతో ముందుకు రావడంతో సేల్స్ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్యాసెంజర్ వెహికల్, టూ వీలర్ సెగ్మెంట్లలో కొత్త లాంచ్ పెరిగాయని తెలిపారు. అయినప్పటికీ సప్లయ్ సైడ్ సమస్యలు కొనసాగుతుండడంతో ప్యాసెంజర్ వెహికల్ సేల్స్పై నెగిటివ్ ప్రభావం పడుతోందని అన్నారు.
