టెర్రరిస్టును జమ్మూ కాశ్మీర్కు పంపుతున్న దాయాది
లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోకి మరింత మంది టెర్రరిస్టులను పంపడానికి పాకిస్తాన్ తీవ్రంగా యత్నిస్తోందని లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. లష్కర్ ఏ తొయిబా, జైషే మొహ్మద్ లాంటి టెర్రరిస్టు గ్రూపులకు అందుతున్న డబ్బులను నిరోధించడంలో విఫలమవడంతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్ను గ్రే లిస్ట్లో ఉంచిన విషయాన్ని రాజు గుర్తు చేశారు.
‘ఎఫ్ఏటీఎఫ్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ పాక్ మాత్రం జమ్మూ కాశ్మీర్కు టెర్రరిస్టులను పంపుతూనే ఉంది. టెర్రరిస్టులు పాక్కు చెందిన వారేనని స్పష్టమైన ఆధారాలున్నాయి. గ్రౌండ్ లెవల్లో టెర్రరిస్టులకు పాక్ నుంచి మద్దతు ఎక్కువగా ఉంది. దీనికి ఇంకేం ఆధారాలు కావాలి. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్లో ఉంచినా.. పాకిస్తాన్ తీరు మాత్రం మారలేదు. ఎల్వోసీతోపాటు జమ్మూలో చొరబాట్లు జరిగాయి. ఎల్వోసీ వద్ద ఇటీవలే మూడుమార్లు చొరబాట్లు జరిగాయి. మేం కొత్త రికవరీలను రూపొందించాం. ఇబ్బంది పెట్టాలి, సమస్యలు సృష్టించాలని పాక్ కృత నిశ్చయంతో ఉంది. కాశ్మీర్లో పరిస్థితి స్థిరంగా ఉంది. చాలా మంది లోకల్ టెర్రరిస్టులను మట్టుపెట్టాం. లోకల్తోపాటు విదేశీ టెర్రరిస్టులను కూడా మట్టుపెట్టాలన్నదే మా లక్ష్యం. ఫారెన్ టెర్రరిస్టులు లోకల్ టెర్రరిస్టుల కంటే మంచి ట్రెయినింగ్ తీసుకొని ఉంటారు. కొందరు టెర్రరిస్టుల దగ్గర చైనీస్ ఎక్విప్మెంట్ ఉండటాన్ని గమనించాం. అక్కడ పీఎల్ఏ ప్రెజెన్స్ ఉంది. రాఫెల్ జెట్స్ రావడం శుభ పరిణామం. అది గ్రౌండ్తోపాటు ఎయిర్ ట్యాక్టిక్స్ను కూడా మారుస్తుంది. ఏదైనా కొత్త ఆయుధం మంచిదే. దీన్ని ఎల్వోసీ లేదా ఎల్ఏసీ వద్ద వాడొచ్చు. అది ఎయిర్ ఫోర్స్ నిర్ణయం మీద ఆధారపడుతుంది’ అని బీఎస్ రాజు చెప్పారు.
