హైదరాబాద్, వెలుగు: బీఎస్ఎన్ఎల్ అంటెనే జెప్పన గుర్తొచ్చేది ట్రింగ్.. ట్రింగ్ సౌండు. ల్యాండ్ ఫోన్లు. ఊర్లల్ల, టౌన్లన్ల బీఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ బిల్డింగు, ఆఫీసులైతే మస్తు మందికి ల్యాండ్ మార్క్లు.. మీటింగ్ పాయింట్లు. ఆ ఆఫీసులకు పోయినమంటె ఎంప్లాయీస్ హడావుడి, పని లొల్లి మనకు యాదుండే ఉంటది. ఏ ఫ్లోర్ల జూసిన జనం మస్తుగుండెటోళ్లు. అట్లాంటి బిల్డింగులు ఇగ ఖాళీ కాబోతున్నయి. ఆఫీసులెన్నో ఇంకో రెండ్రోజుల్లో మూగబోనున్నయి. కారణం.. సంస్థ ప్రకటించిన వీఆర్ఎస్ ఆఫర్కు ఉద్యోగుల నుంచి భారీ స్పందన రావడం. దేశంలోని ప్రైవేటు టెలికం ఆపరేటర్ల వ్యాపార టెక్నిక్లకు బీఎస్ఎన్ఎల్ ఏమూలకూ పోటీ ఇవ్వలేక నష్టాల్లో కూరుకుపోయింది. చివరికి ఉద్యోగులకు జీతాలివ్వడమే కష్టమైపోయింది. కంపెనీని గట్టెక్కించేందుకు ఎంప్లాయీస్కు వీఆర్ఎస్ ప్యాకేజీని తెర మీదకు తెచ్చింది. మంచి ప్యాకేజీ, పెన్షన్, ఇతర బెనిఫిట్లను ప్రకటించింది. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వీఆర్ఎస్కు అప్లై జేసుకున్నరు. ఈ నెలాఖరుకు సంస్థకు బై బై చెప్పబోతున్నారు.
మన దగ్గర 4 వేల మందికి పైగా..
ఆర్థిక నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్)ను ప్రవేశపెట్టింది. వీఆర్ఎస్ తీసుకున్న వారికి ప్రస్తుతమిస్తున్న శాలరీని మిగిలిన సర్వీస్ మొత్తానికి కలిపి రెండు విడతలుగా ఇస్తామని చెప్పింది.
పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తామంది. రిటైర్మెంట్ వయసు వచ్చాక గ్రాట్యుటీ కూడా తీసుకునే వెసులుబాటుందని చెప్పింది. 50 ఏళ్లు పైబడిన వాళ్లకు ఈ అవకాశమిచ్చింది. దేశవ్యాప్తంగా 70 వేల నుంచి 80 వేల మందికి ఈ స్కీమ్ను ఎంచుకునే చాన్స్ ఇచ్చింది. సంస్థలో ఇప్పటికే రెండు నెలల జీతం ఇవ్వకపోవడం, మంచి వీఆర్ఎస్ ఆఫర్ ఇవ్వడంతో చాలా మంది ఉద్యోగులు ముందుకొస్తున్నారు. మన రాష్ట్రం నుంచి 4 వేల మందికి పైగా వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 99 శాతం మంది వీఆర్ఎస్ తీసుకున్నారని అధికారులు చెప్పారు. ఉద్యోగుల జీతం, పెన్షన్ టెలికం డిపార్ట్మెంటే చెల్లించనుంది. సంస్థలో ఒక్కో ఉద్యోగికి సుమారు రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు
అందనుంది.
కొన్ని సెక్షన్లలో ఒకరిద్దరే..
హైదరాబాద్లోని లక్డీకపూల్లో ఉన్న టెలిఫోన్ భవన్లో ప్రస్తుతం వెయ్యి మంది వరకు ఉండగా వీళ్లలో 4 వందల మంది వీఆర్ఎస్ తీసుకున్నారు. రాష్ట్రంలోని మిగతా బీఎస్ఎన్ఎల్ ఆఫీసుల్లోనూ ఇలానే మస్తు మంది సంస్థ ఆఫర్కు ఓకే చెప్పారు. దీంతో ఆఫీసుల్లోని కొన్ని సెక్షన్లలో ఒకరిద్దరే మిగిలారు. ముఖ్యంగా ఔట్డోర్ వర్క్ (ల్యాండ్ ఫోన్, బ్రాడ్బాండ్ సేవలు) చేసేవారు ఎక్కువగా వీఆర్ఎస్ తీసుకున్నారు. ఈ సెక్షన్లలోనే ఎక్కువగా ఖాళీలు ఉన్నా్యి. పని తక్కువున్న ప్రాంతాల నుంచి ఎక్కువున్న ప్రదేశాలకు ఉద్యోగులను రప్పిస్తున్నారు. ఇప్పటికే కొంత మందికి పోస్టింగ్ ఆర్డర్సూ ఇచ్చారు.
సర్వీసులకు ఎఫెక్ట్ లేకుండా..
ఉద్యోగులు చాలా మంది వీఆర్ఎస్ తీసుకున్నా సర్వీసులపై ఎఫెక్ట్ పడదని అధికారులు చెబుతున్నారు. వీఆర్ఎస్ తీసుకున్న వారిలో ఎక్కువ మంది 50 ఏళ్లకు పైబడిన వాళ్లేనని, కాబట్టి అంతగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఇబ్బంది ఉన్న చోట ప్రైవేట్ వారిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటామని వివరిస్తున్నారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో పరిస్థితి అంతా సెట్ అవుతుందని పేర్కొంటున్నారు.
