చట్టాన్ని నమ్మించేందుకు .. మరో హత్య

చట్టాన్ని నమ్మించేందుకు .. మరో హత్య
  •     హత్య కేసులో జైలు శిక్ష 
  •     తప్పించుకునేందుకు వ్యక్తి ప్లాన్
  •     ఘజియాబాద్​లో ఘటన.. విచారణలో గుట్టురట్టు

న్యూఢిల్లీ: కూతురు హత్య కేసులో జైలుకెళ్లి, పెరోల్​పై బయటికొచ్చిండు.. మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఇంకో వ్యక్తిని చంపి, తనే చనిపోయానని నమ్మించే ప్రయత్నం చేసిండో ఖైదీ! పోలీసుల విచారణలో నిజం బయటపడడంతో మళ్లీ కటకటాలపాలయిండు. ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​లో ఈ ఘటన జరిగింది. ఘజియాబాద్​ సిటీలోని లోనె ఏరియాకు చెందిన సుదేశ్​ కుమార్​హత్యానేరంపైన జైలుకెళ్లిండు. 2018లో సుదేశ్​ తన 13 ఏండ్ల కూతురిని చంపాడని పోలీసులు ఆరోపించారు. కేసు కోర్టు విచారణలో ఉంది. అయితే, కరోనా కారణంగా రిమాండ్​ ఖైదీలను అధికారులు పెరోల్​పై బయటకు పంపారు. అట్లా బయటకు వచ్చిన సుదేశ్.. మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు తను చనిపోయినట్లు నమ్మించాలనుకున్నడు. తన ప్లేసులో వేరే వ్యక్తి డెడ్​బాడీని చూపెట్టి, చట్టం నుంచి తప్పించుకోవాలని చూసిండు.

ప్లాన్​ ప్రకారం తన హైటు, వెయిటుకు సరిపోయిన డోమన్​ రవిదాస్​ను ఎంచుకున్నడు. అడ్డాకూలీగా పనిచేసే రవిదాస్​ను తన ఇంట్లో రిపేర్​ వర్క్​ చేయాలని పిలిచి, మందు తాగించి చంపేసిండు. తర్వాత ముఖాన్ని గుర్తుపట్టకుండా కాల్చేసి, శవాన్ని ఓ ఖాళీ ప్రదేశంలో పారేసిండు. డెడ్​బాడీకి తన బట్టలు తొడగడంతో పాటు తన ఆధార్​ కార్డును అక్కడే పడేసిండు. పోలీసులు ఆ ఆధార్​ కార్డ్​ సాయంతో ఇంటికి రావడంతో సుదేశ్​ భార్య ఆ డెడ్​బాడీ తన భర్తదేనని చెప్పింది. అయితే, ఆమె చెప్పేదానికి అక్కడ జరిగిన దానికీ పొంతనలేకపోవడం, సుదేశ్​ బతికే ఉన్నాడని ఇన్ఫర్మేషన్​ రావడంతో పోలీసులు మరింత లోతుగా విచారించారు. దీంతో భార్యాభర్తల ప్లాన్​ బయటపడింది. తర్వాత భార్యను కలుసుకోవడానికి వచ్చిన సుదేశ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవిదాస్​ డెడ్​బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు.