యుఎస్లోని ఎన్నారైలు డాలర్లు, గల్ఫ్లోని కార్మికులు దీనార్లు పంపడం సంగతేమో గానీ, మన డబ్బుమాత్రం విదేశాలకు వెళ్లిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది జూలైలో మన రూపాయి దేశం దాటింది. దీనికి ముఖ్య కారణం 2004లో ప్రవేశపెట్టిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్(ఎల్ఆర్ఎస్). యూపీఏ–2 సర్కార్లో ఎల్ఆర్ఎస్ కింద మొత్తం 5.4 బిలియన్ డాలర్ల రొక్కం ఇక్కడి నుంచి ఇతర దేశాలకు చేరగా, ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ తొలి నాలుగు నెలల్లోనే 5.8 మిలియన్ డాలర్లను మించిపోయింది.
విదేశాల్లో ఎడ్యుకేషన్, టూరిజం, వైద్యం వంటి అవసరాలకోసం గతంలో ఫండ్స్ తీసుకెళ్లాలంటే చాలా ఆంక్షలు ఉండేవి. మన్మోహన్ సింగ్ 2004లో ఫస్ట్ టర్మ్ అధికారంలోకి రాగానే తన రిఫార్మ్స్ని మరికొన్నిటికి విస్తరించారు. అందులో భాగంగా తెచ్చినదే ‘లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)’. ఈ స్కీమ్ కింద ఏటా రెండున్నర లక్షల డాలర్ల వరకు అమౌంట్ పంపొచ్చు. మైనర్లు సహా రెసిడెంట్ ఇండియన్లు (ఇండివిడ్యువల్స్) అందరూ ఫారిన్లో పర్మిషన్ గల ఏదైనా కరెంట్ అకౌంట్కి లేదా కేపిటల్ అకౌంట్కి ఇంత మొత్తంతో ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. విదేశాల్లోని కుటుంబ సభ్యులకు ఇండియా నుంచి గిఫ్ట్ రూపంలో కూడా మనీ ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ను… దగ్గరి బంధువుల ఖర్చులు భరించడానికి, ప్రయాణాలకు, చదువుకు, మెడికల్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
కేపిటల్ అకౌంట్లోని సొమ్మును… విదేశంలోని ఏదైనా బ్యాంక్లో ఫారిన్ కరెన్సీ అకౌంట్ ఓపెన్ చేయటానికి, ఆస్తులు కొనటానికి; మ్యూచువల్స్ ఫండ్స్, వెంచర్ కేపిటల్ ఫండ్స్లో పెట్టుబడికి వాడుకోవచ్చు. దీంతో మన దేశం నుంచి వేరే దేశాలకు జరుగుతున్న రెమిటెన్స్ (చెల్లింపులు) గడిచిన పదేళ్లలో ఊహించని రీతిలో పెరిగిపోయాయి. 2009–14 మధ్య కాలంలో ఈ లావాదేవీలు 500 కోట్ల డాలర్లు మాత్రమే కాగా, 2016లో ఒక్క ఏడాదిలోనే 460 కోట్ల డాలర్ల మార్క్ చేరుకున్నాయి.
మోడీ ప్రధాని అయిన తర్వాత తొలి రెండేళ్లలో ఈ ట్రాన్సాక్షన్స్ నూరుశాతాన్ని మించిపోయాయి. 2018లో 1100 కోట్ల డాలర్లు, 2019లో 1307 కోట్ల డాలర్లు ఎల్ఆర్ఎస్ ద్వారా ఎల్లలు దాటాయి. విదేశాల నుంచి మన దేశానికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్డీఐ)లను, పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించాలని కేంద్రం ఆశిస్తున్న నేపథ్యంలో… వాస్తవ పరిస్థితులు రివర్స్లో ఉండటం ఆలోచించాల్సిన విషయమేనని, ఇండియా ఎంతో కష్టపడి సంపాదించిన ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతాయని ఎకనామిస్టులు, అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
దేనికెంత ఖర్చు చేశారు?
ఇండియా నుంచి ఇతర దేశాలకు పంపిన డబ్బును ఏ ఖర్చులకు వాడారనే విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డేటా విడుదల చేసింది. దాని ప్రకారం ట్రావెల్ కోసం 1,400 కోట్ల డాలర్లకు పైగా ఖర్చయ్యాయి. క్లోజ్ రిలేటివ్స్ని మెయింటైన్ చేయటానికి 1,000 కోట్ల డాలర్ల పైచిలుకు వాడారు. మరో 1,000 కోట్ల డాలర్లను చదువుకి ఖర్చు పెట్టారు. గిఫ్ట్ల ఖాతాలో 408 కోట్ల డాలర్లు వేశారు. స్థిరాస్తుల కొనుగోలుకి 40 కోట్ల డాలర్లు; ఈక్విటీల్లో ఇన్వెస్ట్మెంట్, అప్పులకు 109 కోట్ల డాలర్లు ఇచ్చారు.
బయటి దేశాల్లో కంపెనీలు
విదేశాల్లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి వెళ్తున్నవారిలో ఇండియన్స్ ఎక్కువగా ఉంటున్నారని గ్లోబల్ స్ట్రాటజిస్ట్ రుచిర్ శర్మ లెక్కలు తీశారు. 2017లో 2.1 శాతం సంపన్నులు ఇండియాని విడిచివెళ్లారు. ఈ సంఖ్య ఫ్రాన్స్, చైనాల కన్నా ఎక్కువ కావటం షాక్కు గురి చేస్తోంది. ఫ్రాన్స్ నుంచి 1.3 శాతం మంది, చైనా నుంచి 1.1 శాతం మంది మాత్రమే తరలివెళ్లారని మోర్గాన్ స్టాన్లీ టీమ్ చేసిన స్టడీలో తేలింది. ఎల్ఆర్ఎస్ వల్ల పెట్టుబడులు సరి‘హద్దులు’ దాటుతున్నాయనే థియరీని శర్మ బలంగా ప్రపోజ్ చేస్తున్నారు.
రెమిటెన్స్ పెరిగితే నష్టమేంటి?
ఇండియా నుంచి విదేశాలకు బదలాయింపు పెరగటం ప్రధానంగా మూడు పరిణామాలకు దారి తీస్తుందని ఎకనామిస్టులు చెబుతున్నారు. తప్పుడు లెక్కలు: వేరే దేశాలకు పంపిన డబ్బును ఎక్కువగా ట్రావెల్ కేటగిరీలో చూపారు. కానీ ఆ రేంజ్లో జర్నీలు జరగలేదు. ఈ విషయాన్ని స్పార్క్ కేపిటల్ 2018 రిపోర్ట్లో చెప్పింది. దీన్నిబట్టి మన డబ్బుకి తప్పుడు లెక్కలు చూపి పొలిమేరలు దాటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒక వ్యక్తి రెమిట్ చేసే లిమిట్ 2014 దాక ఏడాదికి లక్షా పాతిక వేల డాలర్ల వరకే ఉంది. దాన్ని రెండున్నర లక్షలకు పెంచారు. కానీ, ట్రాన్సాక్షన్స్ ఆ పరిమితులను మించిపోయినట్లు మల్టిపుల్ రీసెర్చ్ బ్రోకరేజీలు గుర్తించాయి.
పెట్టుబడులకు రెక్కలు: ఎల్ఆర్ఎస్ కింద ఫండ్ ఔట్ఫ్లో పెరగటమనేది మన దేశంలో పెట్టుబడులకు దెబ్బ. విదేశాల్లో పెట్టుబడులు పెరుగుతాయనడానికి గుర్తుగా ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. చిన్న, మధ్య రకం వ్యాపారులు వివిధ కారణాల వల్ల తమ బిజినెస్ను సింగపూర్ లేదా దుబాయ్ వంటి దేశాల్లో పెట్టడంకోసం ఇండియాను విడిచి వెళ్లిపోతున్నారని కూడా అనుకోవచ్చని చెబుతున్నారు. ఈ థియరీని మోర్గాన్ స్టాన్లీ చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ రుచిర్ శర్మ, అవెండస్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ జార్జ్ మిత్ర గట్టిగా నమ్ముతున్నారు.
ట్యాక్స్ నుంచి తప్పించుకోవటం : ఇండియాలో ట్యాక్స్లు తప్పించుకోడానికే రెమిటెన్స్ బాగా జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ రూట్లో జరుగుతున్న రెమిటెన్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భూతద్దం పెట్టి పరిశీలిస్తోందంటూ 2015లోనే వార్తలు వచ్చాయి. ట్యాక్స్ పేయర్లు తమ డబ్బును గిఫ్ట్ల రూపంలో ఇతర దేశాలకు పంపుతున్నారని బ్లాక్ మనీపై ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అమౌంట్… గడచిన ఐదేళ్లలో 500 కోట్ల డాలర్లకుపైగానే ఉంటుందని అంచనా.

