హైదరాబాద్, వెలుగు: టోక్యో ఒలంపిక్స్లో బ్రాంజ్ మెడల్ను సాధించిన సీనియర్ షటిల్ ప్లేయర్ పీవీ సింధు మొత్తం 15 కంపెనీలకు నోటీసులు పంపింది. పర్మిషన్ తీసుకోకుండా కొన్ని కంపెనీలు తమ లోగోలతో పాటు సింధు ఫోటోను కలిపి అడ్వర్ట్యిజ్ చేశాయి. దీంతో సింధు పోర్టుఫోలియోని మేనేజ్ చేస్తున్న స్పోర్ట్స్ మార్కెటింగ్ కంపెనీ బేస్లైన్ వెంచర్స్ 15 కంపెనీలకు నోటీసులు పంపింది. ఈ లిస్టులో హ్యాపిడెంట్ (పెర్ఫెట్టి), పాన్ బహర్, యురేకా ఫోర్బ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, ఎంజీ మోటార్, యుకో బ్యాంక్, పీఎన్బీ, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, విప్రో లైటింగ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు బ్రాంజ్ మెడల్ గెలిచినందుకు సింధుకి కంగ్రాట్స్ చెబుతూనే, తమ లోగోలతో కలిపి ఉన్న ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాయి. చాలా కంపెనీలు ప్రస్తుతం జరిగే ఈవెంట్స్ను తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. కానీ, ఎండోర్స్మెంట్ పరంగా చూస్తే ఎటువంటి అనుమతి లేకుండా ప్రచారం చేసుకుంటే అది అనైతికమని ఎనలిస్టులు అంటున్నారు.
