హోటళ్లను కడుతున్న లగ్జరీ ఆక్షన్ కంపెనీ
వచ్చే ఏప్రిల్ నాటికి అందుబాటులోకి
కదిలే ఇగ్లూ ఇండ్లు, చుట్టూ మంచుకొండలు
ఐదు రోజులకు జస్ట్ రూ.71 లక్షలే
ఉత్తర ధ్రువంలో చల్లచల్లగా ఓ రాత్రి గడపాలని, మంచు తిన్నెల మీద ఎంజాయ్ చేయాలని, మంచుపై అలా అలా షికారు చేసి రావాలని చాలా మంది అనుకుంటుంటారు. అలాంటి వాళ్ల కోరికను నిజం చేస్తామంటోంది ఓ ఫిన్నిష్ లగ్జరీ హోటల్ కంపెనీ. నార్త్పోల్లో కదిలే ఇగ్లూ ఇళ్లను కడతామని, కొన్నిరోజులు అక్కడ ఉండేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెబుతోంది. వచ్చే ఏడాది 2020 నాటికి వాటిని అందుబాటులోకి తీసుకొస్తామంటోంది. పైగా రేట్లు కూడా ఫిక్స్ చేసింది. ఐదు రోజులు ఉండేందుకు రూ.71 లక్షలు కడితే చాలంటోంది. ఇగ్లూలను హీటెడ్ డోమ్స్తో కడతామని, వాటి వళ్ల ఆర్కిటిక్ పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదని చెబుతోంది. చుట్టూ గడ్డకట్టే చలి, మధ్యలో వెచ్చని ఇంట్లో నక్షత్రాలను చూస్తూ పర్యాటకులు పడుకోవచ్చని అంటోంది.
ఏప్రిల్లో హెలికాప్టర్లో..
ఉత్తరధ్రువానికి వెళ్లాలని చాలా మంది అనుకుంటుంటారని, కానీ అక్కడ ఉండేందుకు సరైన సదుపాయాల్లేవని లగ్జరీ ఆక్షన్ కంపెనీ ఫౌండర్ హాంకనెన్ అన్నారు. నార్త్పోల్లో పర్యాటకులు ఎంజాయ్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాని చెప్పారు. ఉత్తరధ్రువంలో ఏడాది మొత్తం మంచున్నా ఎండాకాలం ఏప్రిల్లో హెలికాప్టర్లో.. జూన్, జులై నెలల్లో షిప్పుల ద్వారా అక్కడికి వెళ్లొచ్చని అన్నారు. ఏటా సుమారు వెయ్యి మంది వరకు నార్త్ పోల్కు వెళ్తుంటారని, అక్కడుండేందుకు కావాల్సిన వస్తువులూ వాళ్లే వెంట తీసుకెళ్తుంటారని చెప్పారు. కానీ తమ హోటల్ ప్యాకేజ్లో ఇగ్లూ సూయిట్ టాయిలెట్, ఆన్ సైట్ క్యాంప్ మేనేజర్, ఆర్కిటిక్ వైల్డర్నెస్ గైడ్, చెఫ్, సెక్యూరిటీ టీం సదుపాయం కల్పిస్తామన్నారు. తాము అన్ని సదుపాయాలైతే కల్పిస్తామని, ఉండేందుకు కావాల్సిన ధైర్యం పర్యాటకులకు ఉండాలని చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో అరోరా బోరియాలిస్ యాక్టివ్గా ఉంటాయని, వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు.
క్లైమెట్ చేంజ్ ఏం చేస్తోందో చెప్పేందుకు..
ఉత్తరధ్రువంలో వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, అలాంటి టైంలో తాము చేస్తున్న కదిలే ఇగ్లూ ఇళ్లను వేరే ప్రాంతాల్లోకి తరలించొచ్చని హాంకనెన్ చెప్పారు. తమ ప్యాకేజ్లో భాగంగా నార్వే మెయిన్లాండ్, ఉత్తరధ్రువం మధ్యలో ఉన్న స్వాల్బర్డ్లో రెండు రాత్రులు ఉంటారన్నారు. తర్వాత హెలికాప్టర్లో ఉత్తరధ్రువం ఐస్ క్యాంప్కు చేరుకుంటారని, తర్వాత ఇగ్లూలున్న గ్లేసియర్కు వెళ్తారని, అక్కడ ఓ రాత్రి బస ఉంటుందని వివరించారు. మీల్స్, గైడ్స్ ఫ్రీ అని చెప్పారు. ఇగ్లూల్లో ఉన్న వాళ్లు వాతావరణ మార్పులపై ప్రజలకు వివరంగా చెప్పొచ్చని అన్నారు. నార్త్పోల్లో అవసరాలు ఏర్పాటు చేయడమే కాదు, అక్కడ ఏం జరుగుతోందో, అక్కడి జంతువులు, నేలను క్లైమెట్ చేంజ్ ఎలా మారుస్తోందో చెప్పాలనుకుంటున్నామని వివరించారు. లగ్జరీ ఆక్షన్ కంపెనీని 2009లో మొదలైంది. ఆర్కిటిక్, ఉత్తరధ్రువ ప్రాంతాల్లో హోటళ్లు కడుతుంటుంది. కంపెనీ లాస్ట్ పెద్ద ప్రాజెక్టు అక్టోలా. గత డిసెంబర్లో స్టార్టయింది.
