న్యూఢిల్లీ: దేశంలో రైతు రుణాల మాఫీకి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలూ పరిశీలనలో లేవని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2008లో అమలు చేసిన రుణ మాఫీ స్కీమ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ తరహా పథకాలను మళ్లీ తీసుకురాలేదని ఆయన తెలిపారు. దేశంలోనిఎస్సీ, ఎస్టీ రైతులతో సహా ఏ రైతు రుణ మాఫీ స్కీమ్స్ పరిశీలనలో లేవని చెప్పారు. అయితే రైతు రుణాలపై వడ్డీ రాయితీ పథకాలు రన్నింగ్లో ఉన్నాయని చెప్పారు. రూ.3 లక్షల వరకూ తీసుకునే లోన్లకు వడ్డీపై సబ్సిడీ ఇచ్చేలా పరిమితి పెంచినట్లు తెలిపారు. అలాగే గతంలో రూ.లక్ష వరకు మాత్రమే ఎటువంటి ష్యూరిటీ లేకుండా రైతులకు రుణాలు ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ పరిమితిని కూడా రూ. లక్షా 60 వేలకు పెంచామని చెప్పారు. అలాగే ఏటా రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6 వేల చొప్పున సాయం అందిస్తున్నామని వివరించారు.
