- 179 సంస్థల రెన్యువల్ అప్లికేషన్లు రిజెక్ట్
- 5,789 ఎన్జీవోలు అప్లికేషనే పెట్టుకోలే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు ఆరు వేల నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో)ల ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ లు రద్దయ్యాయి. దీంతో ఆయా సంస్థలకు ఇకపై ఫారిన్ ఫండ్స్ పొందే అవకాశం ఉండదని శనివారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశంలో మొత్తం 5,968 ఎన్జీవోలకు ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ లు రెన్యువల్ చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉండగా, వివిధ కారణాలతో 179 సంస్థల అప్లికేషన్ లను రిజెక్ట్ చేసినట్లు కేంద్రం తెలిపింది. మరో 5,789 సంస్థలు రెన్యువల్కు అప్లై చేసుకోనందున వాటి లైసెన్స్ల గడువు ముగిసిపోయినట్లు పేర్కొంది.
12,520 సంస్థల లైసెన్స్ లు రద్దు
ఎఫ్ సీఆర్ఏ కింద శుక్రవారం వరకు 22,762 ఎన్జీవోలు రిజిస్టర్ అయి ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 16,829కి తగ్గిందని కేంద్రం చెప్పింది. ఇంతకుముందే 6,587 ఎన్జీవోలు లైసెన్స్ కోల్పోగా, మొత్తంగా లైసెన్స్ కోల్పోయిన సంస్థల సంఖ్య 12,520కి చేరినట్లు పేర్కొంది. ‘‘ఎన్జీవోలకు లైసెన్స్ రెన్యువల్ కు సరిపడా టైమ్ ఇచ్చినప్పటికీ అప్లయ్ చేసుకోలేదు. అప్లికేషన్ల గడువును పెంచిన తర్వాత కూడా కొన్ని సంస్థలు అప్లికేషన్లు పెట్టుకోలేదు” అని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ఎన్జీవోలు విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) కింద తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ గడువు ముగిసిపోతే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
లైసెన్స్ కోల్పోయిన వాటిలో కొన్ని..
కోల్కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఆక్స్ ఫామ్ ఇండియా, లెప్రసీ మిషన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, ట్యుబర్ క్యులోసిస్ అసోసియేషన్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ తదితర సంస్థలు లైసెన్స్ కోల్పోయిన లిస్టులో ఉన్నాయి.
