బీజేపీ యువమోర్చా నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జ్ షీట్ దాఖలు చేసింది. 20 మందిని నిందితులుగా పేర్కొంటూ బెంగళూరులోని స్పెషల్ కోర్టులో ఎన్ఐఏ ఈ చార్జ్ షీట్ దాఖలు చేసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కుట్రలో భాగంగానే ప్రవీణ్ నెట్టారును హత్య చేశారని ఎన్ఐఏ చార్జ్ షీట్లో పేర్కొంది. సమాజంలో భయాందోళనలు సృష్టించేందుకు..2047 నాటికి ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే లక్ష్యంతోనే ఈ హత్య చేశారని చార్జ్ షీట్లో పేర్కొంది. తన లక్ష్యాల కోసం పీఎఫ్ఐ సర్వీస్ టీమ్స్, కిల్లర్ స్క్వాడ్స్ అనే రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్టుగా చార్జ్షీట్లో పేర్కొంది.
ప్రస్తుతం ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పేర్కొన్న నిందితుల్లో ఆరుగురు పీఎఫ్ఐ సభ్యులు పరారీలో ఉన్నారు. వీరిలో ఎవరిని పట్టించినా రూ.5 లక్షల రివార్డ్ ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022 జులై 26న మంగళూరులోని పుత్తూరు - సుల్లియా రోడ్డులోప్రవీణ్ నెట్టారు హత్యకు గురయ్యారు. హత్య తర్వాత మంగళూరు, సుళ్య ప్రాంతంలో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి.
